కరోనా మీ చుట్టమా జగన్ .. వస్తూ పోతూ ఉండటానికి : యనమల ఫైర్
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు . సీఎం జగన్ కరోనా వైరస్ను జ్వరంతో పోల్చటాన్ని ఆయన తప్పు పట్టారు . జ్వరం మాదిరిగానే కరోనా కూడా వస్తుంది, పోతుందని.. ఇది సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని సీఎం జగన్ కోరారు. కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదబోదని, రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని కూడా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ వైసీపీ నేతలకు ఏటీఎంగా .. వారి వల్లే కరోనా ఇంతగా .. చంద్రబాబు ఫైర్
జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన టీడీపీ సీనియర్ నేత యనమల
ఇక దీనిపై స్పందించిన యనమల కరోనా వస్తుంది, పోతుంది అనడానికి అదేమైనా మీ చుట్టమా? అని ప్రశ్నించారు. మరణాలు దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు . చిన్న జ్వరంలాంటిదని చెప్పడం జగన్ సైకాలజీకి దర్పణమని వ్యాఖ్యానించారు. ఇక కరోనా టెస్ట్ లలో ప్రభం స్థానం అని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం ప్రజలను రక్షించటం లో రికవరీ లో , డిశ్చార్జ్ రేటులో అడుగు నుంచి 2వ స్థానంలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు .
సీఎం జగన్ తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్
రోజూ సమీక్షలు చెయ్యటం , ఏదో చేస్తున్నట్లు ప్రకటనలే తప్ప ఆచరణలో సున్నా అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రోగ నివారణ కన్నా రంగులేయడంపైనే వైసీపీకి శ్రద్ధ ఉందని మండిపడ్డారు.సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు తాను కరోనా విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తీరు రోమ్ చక్రవర్తి నీరోలా ఉందని యనమల వ్యాఖ్యానించారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా మసి పూసి మారేడుకాయ చేసినట్టు జగన్ తీరు ఉందని యనమల ఆక్షేపించారు . ఇక నిన్నటికి నిన్న వైసీపీ నేతలకు కరోనా ఏటీఎంలా మారిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాళ యనమల వైసీపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంపై నిప్పులు చెరిగారు.
Recommended Video
రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా జ్వరం లాంటిదే అని చేసిన షాకింగ్ వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ వ్యాఖ్యలు నిర్లక్ష్యంగా ఉన్నాయని.. దేవుడు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడాలని ట్వీట్ చేశారు. ప్రతిసారి కరోనా వైరస్ కేవలం జ్వరం మాత్రమే అని చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడగలమని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు . దేవుడు ఏపీని కాపాడాలన్నారు . టీడీపీ నేతలు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు .ఇక ఈ వ్యాఖ్యలను ఏమీ పట్టించుకోని జగన్ మాత్రం తాజా పరిస్థితుల్లోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.