ఎస్ఈసీకి, సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయటం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనా ? సివిల్ సర్వీస్ నిపుణుల్లో చర్చ
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏపీలో ఎప్పుడు, ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠకు కారణం అవుతున్నాయి. కరోనా ప్రభావంతో ఎన్నికల కమీషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని , కరోనా ప్రభావం కూడా లేదని, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖ ఇప్పుడు ఉన్నతాధికార వర్గాల్లో చర్చకు కారణం అవుతుంది.
ఎన్నికలసమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పాలన
ఎన్నికల కమీషన్ అనేది ఒక రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ. కేంద్రంలో ఎన్నికల సంఘానికి ఏ విధమైన అధికారాలు ఉంటాయో , రాష్ట్రంలో కూడా ఎన్నికల సంఘానికి అదే విధమైన అధికారాలు ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత నుండి ఆయా రాష్ట్రాల పాలన అంతా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతుంది. అధికారులందరూ ఎన్నికల కమీషన్ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్ణయాలను వ్యతిరేకించటం కానీ, వారికి సూచనలు, సలహాలు ఇవ్వటం కానీ చెయ్యకూడదు.
ఎన్నికల నిర్వహణ కోసం చీఫ్ సెక్రటరీ లేఖ రాయటం ఆమెను చిక్కుల్లో నెట్టే ప్రమాదం
ఎన్నికల సంఘం ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే. ఒకవేళ అలా ఎవరైనా పాటించకుండా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ నేపధ్యంలో ఎన్నికల కమీషన్ స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ లేఖ రాయటం ఆమెను చిక్కుల్లో నెట్టే ప్రమాదం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాలను చీఫ్ సెక్రటరీ అమలు చేయకపోగా ఎన్నికలు నిర్వహించాలంటూ నేరుగా ఎస్ఈసీకే లేఖ రాశారు.
ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా లేఖ .. సర్వీస్ నిబంధనల ఉల్లంఘన ?
కేవలం ఆదేశాలను అమలు చెయ్యటం వరకే బాధ్యత అని అలాకాకుండా ప్రవర్తించటం సర్వీస్ నిబంధనల ఉల్లంఘన అవుతుందని సివిల్ సర్వీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎస్ పూర్తిగా ఎన్నికల సంఘం ఆదేశాలతో పని చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో సీఎస్ తాను ఎన్నికల సంఘానికి లేఖ సొంతంగా రాసినా,ముఖ్యమంత్రి ఆదేశాలతో రాసినా అది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని అంటున్న పరిస్థితి ఉంది.
డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే ఏపీ సీఎస్ కు తీవ్ర ఇబ్బందులు
ఎవరైనా డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే ఏపీ సీఎస్ నీలం సాహ్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయం కూడా ఉన్నతాధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన క్రమంలోనే పలువురు అధికారుల్ని బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. వారి బదిలీలు జరగలేదు.
Recommended Video
అధికార వర్గాల్లో సీఎస్ రాసిన లేఖపై ఆసక్తికర చర్చ
ఇక ఇదంతా రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించడమేననే భావన వ్యక్తం అవుతుంది. ఇక దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సీఎస్ అంతటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందని సివిల్ సర్వీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారులలో ఇప్పుడు సీఎస్ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆమె ఎన్నికల సంఘానికి లేఖ రాయటమే సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.