‘ఆకర్ష్ ఎమ్మెల్యే’ల ఎఫెక్ట్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీటు హుళ్లక్కేనా?
హైదరాబాద్/ అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అమలుచేస్తున్న 'ఆకర్ష్ ఎమ్మెల్యే' పథకం అమలుతో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 'సైకిల్' ఎక్కడానికి బారులు తీరుతున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల బలం తరిగిపోతున్నది. తత్ఫలితంగా వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీటు దక్కడం అనుమానమేనా? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏప్రిల్లో రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆరు రాజ్యసభ సీట్లు ఉండేవి.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నాలుగు, తెలంగాణకు రెండు సీట్లు కేటాయించారు. 2016లో ఆ ప్రకారమే సీట్ల భర్తీ జరిగింది. కానీ 2018లో జరిగే ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరి మూడు సీట్లు వస్తాయని అంటున్నారు. ఆ ఏడాది రిటైరవుతున్న ఉమ్మడి రాష్ట్ర రాజ్యసభ సభ్యుల ప్రాంతీయత ప్రకారం ఈ రకంగా ఖాళీలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సభ్యుడు రిటైరైన రాష్ట్రమే ఖాళీ..
రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యులు ఎవరు ఏ రాష్ట్రం ఎంచుకొంటున్నారో అడిగి తీసుకొన్నారు. దాని ప్రకారం వారిని ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. ఇప్పుడు రిటైర్మెంట్ సమయంలో ఏ సభ్యుడు రిటైరైతే దానిని ఆ రాష్ట్ర ఖాళీగా చూపుతున్నారు. ఆ రకంగా చెరి మూడు వస్తున్నాయన్నది అధికార వర్గాల కధనం. ఆంధ్రప్రదేశ్లో గతేడాది నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నిక జరిగితే మూడు టీడీపీ, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు.
‘సైకిల్' ఎక్కేసిన వంతాడ రాజేశ్వరి
వచ్చే ఏడాది జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లోనూ రెండు సీట్లు టీడీపీకి, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు వస్తుందని ముందుగా అంతా అనుకున్నారు. కానీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణ ఇంకా పెరుగుతుండడంతో ఈ లెక్కలు మారి పోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే 21 మంది సైకిలెక్కేశారు. నంద్యాల నుంచి ఎన్నికైన భూమా నాగిరెడ్ది తర్వాత చనిపోగా ఆ సీట్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వీరి నిష్క్రమణ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 46కు పడిపోయింది. కొద్ది రోజుల క్రితం రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే వంతాడ రాజేశ్వరి అధికార పక్షంలో చేరారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 45కు తగ్గింది.
మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ‘సైకిల్' ఎక్కేందుకు రెడీ?
రాజ్యసభ ఎన్నికల్లో అధికార వర్గాల కథనం ప్రకారం.. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవాలంటే 45 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. 45 మొదటి ప్రాధాన్య ఓట్లు పడితే రాజ్యసభ సీటు మొదటి విడత లెక్కింపులోనే దక్కుతుంది. ఇప్పుడు సరిగ్గా ఆ పార్టీకి అంతే మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒక్కరు తగ్గినా ఆ పార్టీ రెండో ప్రాధాన్య ఓట్ల కోసం ప్రయత్నించాలి. రెండు, మూడు సీట్లు తగ్గితే మాత్రం రాజ్యసభ సీటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకోవలసిందేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిష్క్రమణ బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరో ముగ్గురు కోస్తా ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని వదంతులు షికార్లు చేస్తున్నాయి.
ఇతర ప్రత్యామ్నాయాలపై ద్రుష్టి సారించిన నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం మూడే పార్టీలు ఉన్నాయి. వీటిలో టీడీపీ-బీజేపీ అధికార కూటమిగా ఉండగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. రాజ్యసభ ఎన్నికల కోసం రెండో ప్రాధాన్య ఓట్లు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను ఆకట్టుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు నుంచి ఓట్లు రావడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నవారు వెనక్కి తగ్గుతున్నారు. అది సాధ్యం కాదన్న అంచనాతో ఇతరత్రా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని వినికిడి. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేరు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సీటు కోసం కొంతకాలం క్రితం ప్రచారంలోకి వచ్చింది. నంద్యాల ఉపఎన్నిక సమయంలో ఆయన పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ప్రచారంలోకి తెచ్చింది. తాజాగా ఎమ్మెల్యేలు జారిపోయే పరిస్థితులు కనిపిస్తుండడంతో రాజ్యసభ సీటు దక్కేది అనుమానంగా ఉండడంతో ఏదైనా లోక్సభ సీటు ఇస్తామని ఆయనకు చెబుతున్నట్లు తెలిసింది. మరికొందరి విషయంలో కూడా ఇవే రకమైన ప్రచారాలు నడుస్తున్నాయి. మరో పక్క టీడీపీలో ఈ సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. మూడు సీట్లు వచ్చే అవకాశం ఉండడంతో కొంతమంది నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు.