ఆ వ్యాఖ్య వెనుక.. హరికృష్ణ మళ్లీ బాబుని టార్గెట్ చేశారా?: అక్కడే డౌట్
స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ, బిజెపి నాయకురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్/అమరావతి: స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ, బిజెపి నాయకురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు-జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంబంధాలపై టిడిపి ఇలా..
ఒకటి వారు పథకాలపై వ్యాఖ్యానించారు. హరికృష్ణ, పురంధేశ్వరి ఇరువురు కూడా ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, కానీ కొత్తవని వాటికి కలరింగ్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.
దూకుడు తగ్గింది..
హరికృష్ణ టిడిపి నేత. కానీ ఆయనలో చంద్రబాబుపై అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. వారసత్వం విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కానీ కొద్ది కాలంగా ఆయన దూకుడు తగ్గింది.
చంద్రబాబును టార్గెట్ చేశారా?
ఆదివారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ చేసిన మరో వ్యాఖ్య కూడా ఆసక్తిని రేపుతోంది. అనుకున్నది సాధించడంలో ఎన్టీఆర్ ధిట్ట అని వ్యాఖ్యానించారు. ఇక్కడే చంద్రబాబును మళ్లీ టార్గెట్ చేశారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా కోసమా..
హరికృష్ణ సూటిగా మాట్లాడుతారు. కానీ ఇవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలా అనే చర్చ సాగుతోంది. విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బిజెపి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. దానిని తీసుకు వచ్చే బాధ్యత తమదని టిడిపి చెప్పింది.
చంద్రబాబు వెనక్కి తగ్గారని..
ప్రత్యేక హోదా కోసం వైసిపి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీలు సహా పలువురు పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, ఏపీకి కావాల్సిన హక్కును సాధించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
బాబుపై చెప్పకనే చెప్పారా?
ఇలాంటి సందర్భంలో హరికృష్ణ.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించడంలో దిట్ట అని చెప్పడం, చంద్రబాబును పరోక్షంగా ఉద్దేశించి అయి ఉంటుందా అని చర్చిస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గారని చెప్పకనే చెప్పారా అని అంటున్నారు.
మహానాడుకు వెళ్లలేదు.. అందుకే డౌట్
ఆయన వ్యాఖ్యల్లో పరమార్థం వెతికే వారికి మరో సమాధానం కూడా ఉందని అంటున్నారు. చంద్రబాబుపై అసంతృప్తి లేకుంటే విశాఖలో జరిగే మహానాడుకు హరికృష్ణ హాజరయ్యేవారని, కానీ ఆయన హాజరు కాలేదని, అందుకే ఆ వ్యాఖ్యల్లో గూడార్థం వెతికేందుకు కొందరికి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.