రెచ్చగొట్టొద్దు: రాజధానిపై జగన్కు టీడీపీ కాల్వ ఆఫర్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాద్దాంతం చేస్తోందని, పులివెందులలో లేదా ఇడుపులపాయలో పెట్టడం మీకిష్టమేనా అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు బుధవారం ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకు ముందే చర్చ చేపట్టాలని, ఓటింగ్ జరపాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో జగన్ పైన, ఆ పార్టీ పైన టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
రాజధానిని పులివెందులలో పెడితే మీకు ఇష్టమేనా అని కాల్వ ధ్వజమెత్తారు. రాజధాని పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విధానం స్పష్టం చేయాలన్నారు. రాజధాని పైన కేంద్రం సాయం రాకుండా చూస్తున్నారన్నారు. రాజధాని పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. దురుద్దేశ్యంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు.
రాజధాని ఎక్కడ ఉండాలనే విషయమై ఆ పార్టీకి, జగన్కు ఏమాత్రం స్పష్టత లేదన్నారు. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ఆ పార్టీ చేస్తోందన్నారు. దురుద్దేశ్యంతో ఇలా రాద్దాంతం చేయడం సరికాదన్నారు.రాజధాని పైన ప్రతిపక్షం ఎలాంటి నివేదిక ఇవ్వలేదని కాల్వ అన్నారు. ఆ పార్టీవి ఉత్తర ప్రగల్భాలన్నారు. సభలో జరుగుతున్న గందరగోళాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. జగన్ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు.
మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పైన జగన్ ఎప్పుడు కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు జగన్ ఎప్పుడు స్పందించలేదన్నారు. విలువైన సభా సమయాన్ని వృథా చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టవద్దన్నారు. కాగా, రాజధాని రగడ మధ్య శాసన సభ గురువారానికి వాయిదా పడింది.