జగన్ , కేసీఆర్ ఎఫెక్ట్.. ? శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు
విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన వారు బారులు తీరుతున్నారు. దాంతో శారదాపీఠానికి రాజకీయ నాయకులతో సందడి నెలకొంది .
విజయవాడలో 30న జగన్ ప్రమాణస్వీకారం.. ట్రాఫిక్ డైవర్షన్ ఎలా అంటే..!
స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం కోసం బారులు తీరుతున్న రాజకీయ ప్రముఖులు
జగన్ ఎన్నికలకు ముందు ఏ పని చేసినా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ ఆశీర్వాదంతోనే చేశారు. ఆయనపట్ల జగన్ యెనలేని గౌరవాన్ని ప్రదర్శిస్తారు. కనుకే వైసీపీ నుండి రాజకీయ ప్రముఖులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీర్వాదం కోసం బారులు తీరుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామి ఎలాగో అలాగే జగన్ కు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఏపీలో అంతా భావిస్తున్నారు.
స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు
ఈ నేపధ్యంలోనే విశాఖ ఎంపీ విజేత ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ విజేత సత్యవతి, వెంకటగిరి ఎమ్మెల్యే విజేత ఆనం రామనారాయణరెడ్డి, భీమిలి-ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దర్శి-మద్ది వేణుగోపాల్, జగ్గయ్యపేట-ఉదయభాను సామినేని, బొబ్బిలి- శంబంగి చిన అప్పలనాయుడు, గాజువాక-తిప్పల నాగిరెడ్డి, పాయకరావుపేట-గొల్ల బాబూరావు, ఆమదాలవలస-తమ్మినేని సీతారాం, అనకాపల్లి-గుడివాడ అమర్నాథ్, కొట్టగుళి భాగ్యలక్ష్మీ, అరకు-చెట్టి ఫల్గుణ,మాడుగుల-బి.ముత్యాలనాయుడు, తణుకు-కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గిద్దలూరు-అన్నా వెంకటరాంబాబు,పెందుర్తి-అన్నంరెడ్డి అదీప్రాజ్, చోడవరం-కరణం ధర్మశ్రీ, కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు, నందికొట్కూరు- ఆర్థర్, రాయదుర్గం-కాపు రామచంద్రారెడ్డి, పాడేరు స్వామీజీని దర్శించుకున్నారు.
జగన్ కు సన్నిహితంగా ఉండే స్వామీజీ .. అందుకే ఆయన ఆశీర్వాదం కోసం నేతల పాట్లు
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడంతో విశాఖపట్నం శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో పలువురు ఆయనను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఆయనతో ఏ విధమైన సంబంధాలు లేనివారు కూడా ఇప్పుడు ఆయన దర్శనం కోసం వస్తున్నారు. స్వరూపానందేంద్ర స్వామి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే . జగన్ ప్రమాణస్వీకారానికి ఆయనే ముహూర్తం పెట్టారు. పైగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కూడా ఆయన సన్నిహితులు. స్వామీజీ చేత కేసీఆర్ రాజశ్యామల యాగం చేయించారు. ఇక ఈ నేపధ్యంలో శారదా పీఠం ఏపీ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంది.