ఎపిలో ఐటి దాడులు:నిజమా?....అసలు సినిమా ముందుందా?...అధికారులే అంటున్నారట!
అమరావతి:ఎపిలో ఇటీవల జరిగిన ఐటీ దాడులు ఓన్లీ ట్రైలర్ మాత్రమేనా?...అసలు సినిమా ముందుందా?...అంటే అవుననే అంటున్నారట అధికారులు. పైగా ఆ మాట వాళ్లు వీళ్లూ కాదట...ఈ దాడుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఐటి అధికారులే అలా అంటున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎపిలో ఇంతకంటే భారీ స్థాయిలో పెద్దఎత్తున ఐటి దాడులు జరగవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పైగా ఈ విషయాన్ని దాడుల్లో పాల్గొన్న అధికారులే వారి స్నేహితులతో చెప్పడం వల్ల ఈ విషయం బైటకు పొక్కిందని అనుకుంటున్నారు. ఆ దాడుల్లో బడా నేతల బండారం కూడా బైటపడుతుందని, అలా జరగకుండా ఎవరూ ఆపలేరని వారు కాన్ఫిడెంట్ గా చెప్పారట.
మళ్లీ...ఐటి దాడులు తప్పవా?
ఎపిలో ఐటీ దాడులు ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపించినా...అవి ఆగిపోయాయనుకుంటే పొరపాటేనని...మళ్లీ ఐటి దాడులు జరగడం ఖాయమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమకు ఒక చిన్న బ్యాంకు నుంచి కీలక సమాచారం అందిందని, ఆ ప్రకారం ముందుకెళ్తే చాలా ముఖ్యమైన విషయాలే తెలిసాయని...ఆ సమాచారంకి సంబంధించి ఇంకా దాడులు జరపనే లేదని...త్వరలో అందుకోసమైనా దాడులు తప్పవని ఐటి అధికారులు అంటున్నారట.
ఈసారి...సంచలనాలేనా
ఈసారి జరిపే దాడుల్లో చాలా సంచలన విషయాలు వెలుగు చూస్తాయని...అన్ని వివరాలు ఒకేసారి వెల్లడించాలనే ఇటీవల జరిగిన దాడులు తాలూకు విషయాలు ఏమీ బైటకు ప్రకటించలేదని వారు తెలిపారట. కొంతమంది ఇటీవలి దాడుల్లో ఐటి అధికారులకు ఏమీ దొరకనందునే వివరాలు వెల్లడించడం లేదని అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని...ఆ దాడుల్లో కొన్ని లాకర్ల నుంచి రూ.కోటికి పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు అంతర్గత సంభాషణల్లో తమ స్నేహితులకు వెల్లడించారట.
కర్ణాటక ఫలితాల వల్లే...ఆలస్యం
కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ పోషించిన పాత్ర కేంద్రానికి నచ్చలేదని...టిడిపి వల్లే తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఓటమి పాలైందని ఆగ్రహం చెందిందని టిడిపి నేతల విశ్లేషణ. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే...అక్కడి తెలుగు ప్రాంతాల్లో తమపై వ్యతిరేకత ఉందని బీజేపీకి అర్థమైందట. దీంతో ఎన్నికలు అయిపోగానే ఏపీలో ఐటీ దాడులు జరపాలని మోదీ ప్రభుత్వం అనుకుందని...అయితే అక్కడ బీజేపీ ఓటమితో వెనక్కి తగ్గిందని...ఇక ఇప్పుడు ఎన్నిక లు సమీపిస్తున్నందున దాడులకు సిద్ధమైందని వారంటున్నారు.
వాళ్లిక్కడే ఉన్నారు...టిడిపి నేతల విశ్లేషణ
ఇదిలావుంటే సోదాల కోసం చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇంకా రాష్ట్రంలోనే ఉన్నారని టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం భవిష్యత్ దాడుల కోసమే వారు ఇక్కడ ఉన్నారని...ఈలోపుగా ఇక్కడి నేతల సమాచారం రాబట్టడమే వారిపని అని...వివిధ మార్గాల్లో ఈ ఐటి అధికారులు ఆ సమాచారం రాబడుతున్నారని టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు.