కన్నాకు సాధ్యమేనా... కష్టమా?:ప్రస్తుతం.. ఎపిలో బిజెపిని నిలబెట్టడం!
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ లో 90 దశకం నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ తిరుగులేని నేతలుగా చలామణి అయిన తక్కువమంది నేతల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండే విశ్వసనీయమైన వ్యక్తిగా కన్నా లక్ష్మీనారాయణకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఆయన టిడిపిపై చంద్రబాబుపై నేరుగా ఎన్నో విమర్శలు చేసినా, అవి కాంగ్రెస్ ,టిడిపి ల మధ్య విమర్శలకే కాకుండా వ్యక్తిగత వైరం స్థాయి వరకూ వెళ్లినట్లుగా కనిపించినా...టిడిపి ఆయన్ని తమ పార్టీ రప్పించాలని విశ్వప్రయత్నం చేసింది.
ఆ పార్టీలో ఈయన విమర్శల ధాటికి ఎక్కువగా గురైన సిఎం చంద్రబాబే నాకు కన్నా కావాలని పట్టుబట్టారనే టాక్ నడిచిందంటే రాజకీయంగా కన్నా కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే బిజెపి కూడా ఆయన పార్టీని విడిచి వెళ్లిపోతానని రాజీనామా చేసినా ఎప్పట్నుంచో ఉన్న తమ రూల్స్ అన్నింటినీ పక్కన బెట్టి మరీ కన్నాను అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ఇప్పుడు ఎపిలో బిజెపి ఉన్న పరిస్థితిలో ఈ పార్టీని కన్నా తన సామర్థ్యంతో గట్టెక్కిస్తారా? లేక పార్టీ వ్యతిరేక పరిస్థితుల ధాటికి తాను కూడా మునిగిపోతారా?...అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కన్నా లక్ష్మీనారాయణ...విశిష్ట నేత
కన్నా లక్ష్మీనారాయణ...గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్రవ్యాప్తంగా చిరపరిచితమైన రాజకీయ నేత....గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలోకి యుక్త వయసులోనే అడుగుపెట్టడమే కాదు ఆ పార్టీ తరుపున పలు దశాబ్దాల పాటు తిరుగులేని నేతగా వెలిగారు. అచంచల కార్యదీక్ష, మెండైన అంకితభావంతో పనిచేసే నైజం ఆయన సొంత కాబట్టే కాంగ్రెస్లో మిగిలిన నేతల కంటే విశేషమైన గుర్తింపు కన్నా లక్ష్మీనారాయణ లభించింది. అందుకే నేదురుమల్లి జనార్ధన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎం అయినా, రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ముఖ్య మంత్రులైనా వారి కేబినెట్లో ఆయనకు పెద్దపీట వేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎంత మంది ఉన్నా ఆగస్ట్ 15 కి జండా ఎగురవేసే అరుదైన అవకాశం ఏ ముఖ్యమంత్రి అయినా అయనకు మాత్రమే కల్పించేవారు.
రాజకీయ ప్రస్థానం...విజయాలే ఎక్కువ
1989లో గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తరువాత మరో మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి, మరోసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి...మొత్తం మీద జిల్లా నుంచి ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు ఉన్న తీవ్ర ప్రతికూల వాతావరణం లో...అనేకమంది హేమాహేమీలు అసలు పోటీచేసేందుకే వెనుతీసినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్టీ విధేయుడిగా గుంటూరు పశ్చిమం నుంచి మరోసారి పోటీచేశారు. ఈ పోటీలో కన్నాకు మూడో స్థానం లభించింది. నిజానికి ఈ పోటీ విషయంలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం తెలిసినా తన అంకితభావం తెలిసిన ప్రజలు తనను మళ్లీ ఎన్నుకుంటారని కన్నా భావించారు. అయితే ఆ ఓటమితో ప్రజలకు తన పట్ల నమ్మకం కంటే కాంగ్రెస్ పట్ల ఉన్న అసంతృప్తి స్థాయిని అర్థం చేసుకున్న ఆయన ఆ తరువాత బిజెపిలో అడుగుపెట్టారు.
పార్టీ మార్పు...నిర్ణయం
ఆ సందర్భంలో కూడా ఆయన వైసిపిలోకి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం అప్పట్లో ఆ పార్టీపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణల పర్వమే నని చెప్పుకోవచ్చు. సహజంగా రాజశేఖర్ రెడ్డిని ఇష్టపడే నాయకుడిగా ఆ పార్టీ వైపే ఆయన అనుచరులు మొగ్గు చూపినా ఆ అవినీతి ఆరోపణల మకిలి తనను అంటడం ఇష్టం లేకనే ఆయన ఆ పార్టీలోకి వెళ్లేలేదని ఆయన అనుచరులు అభిప్రాయం. ఇక టిడిపి లోకి వెళ్లకపోవడానికి మిగిలిన కారణాలు ఎన్నున్నా ప్రధాన కారణం తాను ఎన్నో సందర్భాల్లో తీవ్రంగా విమర్శించిన అదే పార్టీలోకి అడుగుపెట్టడం పైటికంగా కరెక్ట్ కాదనే అభిప్రాయంతోనే ఆయన ఆ పార్టీలోకి వెళ్లలేదనేది ఆయన సన్నిహితుల మాట.
బిజెపిలోకి...ఎందుకంటే?
ఆ పరిస్థితుల్లో టిడిపి తో, ఆ పార్టీలో ఉన్న ఇతర ప్రత్యర్థుల నుంచి కక్ష సాధింపు చర్యలు ఎదురవ్వచ్చనే ఆలోచనతో...అలాగే భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్న నేతగా ఆయన బిజెపిలో చేరారనుకోవచ్చు. అయితే అలాంటి నేత కు కారణాలేమైనప్పటికీ ఇటీవలి కాలం వరకు తన సామర్థ్యాన్ని వినియోగించే అవకాశం ఆ పార్టీ కల్పించలేదనే చెప్పాలి. దానికి తోడు ప్రత్యేక హోదా తిరస్కరణ నేపథ్యంలో ఎపిలో బిజెపి కూడా ఒకప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ఎదుర్కొన్న తరహా వ్యతిరేకత ఎదుర్కోవడంతో ఒకసారి అనుభవంతో రాజకీయ పార్టీ ప్రభావాన్ని ముందే పసిగట్టిన ఆయన మరోసారి దెబ్బతినేందుకు ఇష్టపడక పార్టీ మారేందుకు అంతా సిద్దం చేసుకున్నారు.
నిబంధనలు...తోసిరాజని...
దీంతో ఎపిలో తాజా రాజకీయ పరిణామాలతో భవిష్యత్తు గురించి అంచనా వేసిన బిజెపి తమ పార్టీ నియమనిబంధనలన్నీ పక్కనబెట్టి ఎపి బిజెపి అధ్యక్షుడిగా కన్నాకు పట్టంగట్టింది. సాధారణంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే ఆనవాయితీ లేనే లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని కోణాల్లో యోచించిన బిజెపి అధిష్టానం కన్నా కంటే గట్టి నేతను ఎపి బిజెపి అధ్యక్షుడిగా తేవడం అసాధ్యమని భావించి ...పార్టీ నియమావళిని సైతం తోసిరాజని ఆయనకే సారథ్య బాధ్యతలు అప్పగించింది.
నిలుస్తారా?...చిత్తవుతారా?
అయితే ఎపిలో బిజెపి ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో కన్నా ఆ పార్టీని ఎంతవరకు బలోపేతం చేయగలరు...అసలు ఏ దిశలో పార్టీని పటిష్టపర్చగలరనేది రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ పార్టీ తరుపున పోటీ చేసి తానే గెలవలేకపోయిన కన్నా ఇప్పుడు అలాంటి ప్రతికూలతే ఎదుర్కొంటున్న బిజెపిని రాష్ట్రం అంతా ఎలా బలోపేతం చేయగలరనేది ఆయన ప్రత్యర్థుల ప్రశ్న. అయితే గతంలోకి ఇప్పటికి కన్నాకు ఉన్న సానుకూల పరిణామం ఏమిటంటే...అప్పట్లో ఎపి కాంగ్రెస్ నేతలంతా కాడి కిందపడేయటం...అధిష్టానం నుంచి ఏమాత్రం మద్దతు లేకపోవడం మైనస్ కాగా...ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా, రాం మాధవ్ తో పాటు అవసరమైతే ప్రధాని మోడీ కూడా కన్నా కు పుష్కలంగా అండదండలు అందించే అవకాశం ఉండటం...సో...ఇప్పుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఒక విషమ పరీక్షకు సంసిద్దులు అయ్యారనే చెప్పకతప్పదు. మరి పెను సవాలు లాంటి ఈ రాజకీయ రణరంగంలో కన్నా నెగ్గుకొస్తారా?...చిత్తవుతారా? అనేది కాలమే తేల్చనుంది.