ఏది నిజం: పారదర్శకతా..కక్ష్యసాధింపా..జగన్ మదిలో ఏముంది..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేక మలుపులు తీసుకుంటున్నాయి. చట్టపరంగా వెళుతున్నామని కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెబుతుంటే.. జగన్ సర్కార్ తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ వాదిస్తోంది. తాజాగా ప్రజావేదికను ప్రభుత్వం కూల్చడంతో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ప్రజావేదికను వదిలివేయాల్సిందిగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు లేఖ రాశారు. అయితే లేఖ రాసిన పక్షం రోజులకే ప్రజావేదికను కూల్చేస్తారని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు.
చంద్రబాబు టార్గెట్గా జగన్ అడుగులు వేస్తున్నారా..?
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. పాలనపై పట్టు సాధించిన ఏపీ సీఎం జగన్ అవినీతి నిర్మూలించేందుకు చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా అవినీతి ఉండేందుకు లేదని చెబుతూ... తాను కలెక్టర్ల తొలి సమావేశం నిర్వహించిన ప్రజావేదికనే ముందుగా కూల్చాలని చెప్పడంతో అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇలా కృష్ణ పరీవాహక ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘించి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ప్రజావేదిక తర్వాత చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌజ్కు నోటీసులు ఇచ్చింది సీఆర్డీఏ. ప్రజావేదిక పక్కకు పెడితే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చడం అనే ఆదేశాలను తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకున్నారు. ఈ గెస్ట్ హౌజ్ అన్ని నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారని ప్రభుత్వం చెబుతోంది. అయితే తాము అధికారంలో ఉండగా తమ ప్రత్యర్థులపై ఎందుకు ఈ స్థాయిలో విరుచుకుపడలేదనేది తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా అధికారంలోకి రాగానే ఈ స్థాయిలో జగన్ విరుచుకుపడుతారని ఊహించలేకపోయారు.
జగన్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న పర్యావరణ ప్రేమికులు
ఇదిలా ఉంటే జగన్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాటర్మ్యాన్గా పిలువబడే రాజేంద్రసింగ్ నుంచి స్థానికి పర్యావరణ ప్రేమికుడు అనుమోలు గాంధీ వరకు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలతో కృష్ణా పరీవాహక ప్రాంతం ధ్వంసం అవుతుండటం చూసి నాడు చాలా బాధపడ్డారు పర్యావరణ ప్రేమికులు. ఇక ప్రజావేదికను కూల్చడం రాజకీయ కక్షసాధింపులో భాగమే అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నప్పటికీ అంత త్వరగా జగన్ నిర్ణయం తీసుకోవడంతో వారు షాక్కు గురవుతున్నారు. ఆ తర్వాతే లింగమనేని గెస్ట్ హౌజ్కు నోటీసులు ఇవ్వడంతో జగన్ మార్క్ పాలనపై సర్వత్రా ఆసక్తి చర్చ జరుగుతోంది.
అన్ని కట్టడాలుండగా ఒక్క ప్రజావేదికనే ఎందుకెంచుకున్నారు..?
గత కొన్నేళ్లుగా కృష్ణ పరీవాహక ప్రాంతంలో 50కి పైగా అక్రమ కట్టడాలున్నాయి. అయితే వాటన్నిటినీ జగన్ వదిలేసి ఇప్పుడిప్పుడే కట్టిన ప్రజావేదిక నుంచే కూల్చడాలు ప్రారంభించడం వెనక ఉన్న మతలబేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దాదాపు రూ.9 కోట్లతో నిర్మించిన భవనంను అంత అర్జెంటుగా కూల్చడం దేనికని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు కదా అనే సలహా ఇస్తున్నారు. అయితే రాజకీయాల్లో లాజిక్లు వర్కౌట్ కావు. అనుకుంటే అది జరిగిపోవాల్సిందే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఈ భవనాలు ఉన్నాయని అయితే ఇక్కడ ప్రశ్న నిబంధనలను ఉల్లంఘించి కట్టారా కాదా అనేది కాదని... చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయాలని జగన్ ఫిక్స్ అయ్యారని అందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
ఏపీలో తమిళ తరహా రాజకీయాలు ..?
మొత్తానికి ఆంధ్ర రాజకీయాలు చూస్తుంటే త్వరలో తమిళనాడు తరహా పాలిటిక్స్ ఇక్కడ చోటుచేసుకుంటాయనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు అనలిస్టులు. తమిళనాడులో జయలలిత వర్సెస్ కరుణానిధి అన్నట్లుగా ఉండేది. జయలలిత అధికారంలోకి వస్తే కరుణానిధిని వెంటాడేవారు. కరుణానిధి అధికారంలోకి వచ్చిన సమయంలో జయలలితకు ఇబ్బందులు తప్పేవి కాదు. ఇప్పుడు ఏపీలో కూడా పాలిటిక్స్ ఇదే టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.