2018 బడ్జెట్లో రైల్వే: విశాఖ జోన్ కథ కంచికేనా? ఎన్నికల ముందైనా తేల్చేనా?
విశాఖపట్నం / అమరావతి: దాదాపు నాలుగేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడివడ్డాయి. నాటి నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గట్టిగా వినిపిస్తున్నా కేంద్రంలో ఆంధ్రుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏయేటికాయేడు ప్రతిపాదనలు తయారుచేసి హస్తినకు పంపారే గానీ వాటిల్లో కొత్తవేమీ లేకపోవడం విచారకరం. రైల్వేశాఖ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నేరుగా 'విశాఖ రైల్వే జోన్' గురించి బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ డివిజన్ పరిధిలో పలు ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు, కేంద్రానికి పంపుతున్నా.. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉన్నదే తప్ప ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రకారం ఈ పాటికే జోన్ మీద పూర్తి స్పష్టత రావాలి. గతేడాది చివరిలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, రైల్వే డీఆర్ఎం, ఇతర డివిజనల్ అధికారులు, డీఆర్యూసీసీ సభ్యులు సమావేశమై బడ్జెట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పలు ప్రతిపాదనల్ని జోన్ ద్వారా రైల్వేబోర్డు, మంత్రిత్వ శాఖకు పంపారు.
మంజూరైన పనులున్నా.. పూర్తయ్యేదెన్నడో?
మరోవైపు సోషల్ మీడియాలో ఎంపీల మీద, రైల్వే అధికారుల మీద రైల్వేజోన్తో పాటు పలు కీలక ప్రాజెక్టుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తయారైన ప్రతిపాదనల్లో వివాదాస్పద విషయాల్లోకి వెళ్లకుండా రైల్వే అధికారులు చాలావరకు పాత ప్రతిపాదనలే పంపినట్లు తెలుస్తోంది. ఇదివరకు మంజూరైన పనులు చాలానే డివిజన్ పరిధిలో ఉన్నాయని వీటిని పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నదని విశాఖపట్నం ఎంపీ హరిబాబు పేర్కొన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయించే విషయమై కూడా పరిస్థితీ ఇలాగే ఉన్నదని, మరో ప్రధానాంశంగా విశాఖ-వారణాసి రైలుకు బోగీల్ని ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. రైల్వేజోన్ మీద, విశాఖ స్టేషన్ పునర్నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయని హరిబాబు చెప్పారు.
రైల్వేబోర్డు చైర్మన్తో ఇలా టీఎస్సార్
విశాఖ రైల్వేస్టేషన్లో మరిన్ని వసతులు మెరుగు పరచాల్సి ఉన్నదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి అన్నారు. విశాఖ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా ప్రతిపాదించామని, విశాఖ స్టేషన్లో 4 అదనపు ప్లాట్ఫామ్లు నిర్మించాలనీ కోరామన్నారు. ప్రాధాన్యాల్ని బట్టి ప్లాట్ఫామ్లను పెంచుకుంటూ వెళ్లాలని రైల్వేబోర్డు ఛైర్మన్కు చెప్పానని, విశాఖ-గోపాలపట్నం మధ్య ఇప్పుడున్న 2 లైన్లకు అనుబంధంగా మరో 2 లైన్లు వేయాలని ప్రతిపాదించానని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.
బల్బ్ లైన్ క్లియర్ చేస్తే విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలే మార్పు
అతి కీలకమైన ప్రతిపాదన బల్బ్లైన్. ఇది వస్తే విశాఖ రైల్వేస్టేషన్ భవిష్యత్తే మారిపోతుంది. అయితే విశాఖ పోర్టువారు దీనికోసం స్థలం ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఇది స్థానికంగా తేలే సమస్య కాదని రైల్వేబోర్డుకు కూడా గతేడాది ప్రతిపాదించారు. నౌకాయాన మంత్రిత్వ శాఖతో మంతనాలు జరుపుతామని చెబుతున్నా ఇప్పటికీ స్పష్టత లేదు. కేకేలైన్, కేఆర్లైన్కు నిధులు రావాల్సి ఉంది. పైగా విద్యుదీకరణకూ ఇంకా నిధులు కేటాయించలేదు. రాయగడ-విజయనగరం మూడోలైన్, విజయనగరం-పలాస 3వ లైన్కు నిధుల కోసం ప్రతిపాదించారు. విజయవాడ వైపుగా రైళ్ల ట్రాఫిక్ బాగా ఎక్కువ. ఈ నేపథ్యంలో విశాఖ - తుని మధ్య వయా నర్సీపట్నం, చోడవరం మీదుగా ప్రత్యేక రైల్వేలైను వేయాలని ప్రతిపాదించారు. తుపాన్ల సమయంలోనూ ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఖరగ్పూర్ నుంచి విశాఖ మీదుగా విజయవాడ వరకు ప్రతిపాదించిన ప్రత్యేక సరకు నడవా లైనును ఇదివరకే బడ్జెట్లో ప్రతిపాదించారు. సర్వే పూర్తయ్యిందని కూడా చెబుతున్నా, దీనికి నిధుల కేటాయింపులు జరిగితేగానీ ప్రాజెక్టు కదిలే పరిస్థితి కనిపించడంలేదు.
అమరావతి - విశాఖ మధ్య రైళ్ల ఊసే లేదు
విశాఖ-వారణాసి మధ్య రైలు ఇదివరకే మంజూరైంది. కానీ ఇంతవరకు ఈ రైలుకు బోగీల్ని కేటాయించలేదు. ఇవి ఎప్పుడు వస్తాయనేది స్పష్టత రావడం లేదు. విశాఖ నుంచి బెంగళూరు, యశ్వంతపూర్ వైపు సూపర్ఫాస్ట్ రైళ్లను నడపాలని కోరుతున్నారు. ఐటీ ఉద్యోగులు, అటుగా ప్రయాణికుల రాకపోకలు పెరగడమే ఇందుకు కారణం. ఇక విశాఖ - తిరుపతి, విశాఖ - అమరావతి మధ్య రాత్రిపూట ప్రయాణించే రైళ్లనూ నడుపాలని కోరుతున్నారు. వీటితోపాటు గుంటూరు - ఆముదాలవలస మధ్య రాత్రిపూట నడిచే రైలు వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రతిపాదించారు. విశాఖ - తిరుపతి మీదుగా వారానికి మూడుసార్లు నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలును.. విశాఖ - విజయవాడ మధ్యే తిప్పాలని ప్రతిపాదించారు.
పలు రైళ్ల కోసం ప్రతిపాదనలు చేసినా పట్టించుకునేదెవరు?
ఏపీ ఏసీ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణాన్ని 4, 5గంటల సమయాన్ని తగ్గించేలా కొన్ని చిన్న స్టేషన్ల స్టాప్లు తగ్గించాలని ప్రతిపాదించారు. తెలంగాణలో ఇదివరకే ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఉన్నందున ఆ ప్రాంతంలో కొన్ని స్టేషన్లను తగ్గించాలని కోరారు. విశాఖ-అరకు మధ్య విస్టాడోమ్ కోచ్ రెండో బోగీ మంజూరైనా ఇంతవరకు దాని జాడే లేదు. విశాఖ-ఉజ్జయిని మధ్య వయా భోపాల్, ఇండోర్ కలుపుతూ వారానికి రెండుసార్లు తిరిగే రైలు అవసరమని చెబుతున్నారు. విశాఖ-కన్యాకుమారి మధ్య వయా పాల్గాట్, కోచి మీదుగా వారానికి మూడుసార్లు నడిచే రైలు కావాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న విశాఖ - అమృత్సర్ ఎక్స్ప్రెస్ను వయా కాట్ర మీదుగా ఉద్ధంపూర్ వరకు పొడిగించేందుకు మరో ప్రతిపాదన ఉంది.
విశాఖ, విజయనగరం స్టేషన్లలో వసతులు మెరుగు పర్చాలి
పెందుర్తి రైల్వేస్టేషన్ను శాటిలైట్స్టేషన్గా మార్చాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నది. ఇక్కడ వీలైనన్ని ప్లాట్ఫామ్ల విస్తరణకు అవకాశముందనీ అంటున్నారు. అక్కడ ప్రయాణికుల కనీస వసతుల్ని పెంచి కనీసం 2, 3 ఎక్స్ప్రెస్ రైళ్లకైనా స్టాప్లు పెట్టాలన్న ప్రతిపాదన ఉన్నది. విశాఖ స్మార్ట్సిటీగా మారుతున్నందున కొత్తవలస స్టేషన్ను అభివృద్ధి చేసేందుకూ ప్రాధాన్యం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక విశాఖ, విజయనగరం రైల్వేస్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ప్రతిపాదనలుగానే ఉన్నాయి. దువ్వాడ, రాయగడ, శ్రీకాకుళం, కూనేరు లాంటి కొన్ని స్టేషన్లలో పైబాట వంతెనల్ని నిర్మించాలని కోరారు. దువ్వాడలో 2,3 ప్లాట్ఫామ్ మీద పైకప్పు, అలాగే స్టేషన్లో రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, ఫుడ్కోర్టులు, ఏటీఎంలు కూడా ఏర్పాటయ్యేలా చూడాలని ప్రతిపాదన ఉంది.
లోక్ షెడ్ ఆధునీకరణకు శంకుస్థాపన చేసినా ఫలితం శూన్యం
విశాఖ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ప్రాజెక్టు అటకెక్కినట్లే కనిపిస్తోంది. జోన్స్థాయిలో పీపీపీ విధానంలో టెండర్లు పిలిచినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఐఆర్ఎస్డీసీ ఇచ్చామని చెప్తున్నా ఇంతవరకు రైల్వేబోర్డు నుంచి కచ్చితమైన ప్రకటనగానీ, ప్రాజెక్టు ముందుకు నడిచేందుకు సూచనలే కానరాలేదు. కేకేలైన్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలకోసం ప్రత్యేక ప్రాజెక్టు తీసుకొచ్చే విషయమై ఇంతవరకూ కదలికలేదు. సాంకేతికతను ఉపయోగించి అనంతగిరి కొండల్లో రాళ్లు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. వ్యాగన్ పీవోహెచ్ వర్క్షాప్ నిర్మాణాలు మొదలు పెట్టామంటున్నా, ఇంతవరకు దానిమీద పెద్దఎత్తున నిధుల కేటాయింపులు లేవు. డీజిల్ లోకోషెడ్ ఆధునీకరణకు రైల్వే మంత్రి శంకుస్థాపన చేసినా నిధులు విడుదల కాలేదు. దీంతోపాటు విశాఖపట్నం-గోపాలపట్నం 3వలైన్ సర్వే పూర్తయ్యిందని చెబుతున్నా దీనికీ ఇంకా నిధులు రాలేదు.