Must Read : శాసనమండలి రద్దు సాధ్యపడుతుందా? చరిత్ర, రాజ్యాంగం ఏం చెబుతున్నాయి?
వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ.. మండలిలో మాత్రం చుక్కెదురవడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో 151 సభ్యుల బలంతో బిల్లును ఆమోదింపజేసుకున్న జగన్కు.. మండలి మాత్రం తలనొప్పిగా మారింది. అక్కడ టీడీపీదే ఆధిక్యత కావడంతో బిల్లును ఆమోదింపజేయడం అసాధ్యం. ఇప్పుడే కాదు.. ప్రభుత్వం ఏ బిల్లును తీసుకొచ్చినా మండలితో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. మండలిలో వైసీపీ పట్టు సాధించాలంటే.. కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అప్పటివరకు ప్రతీ బిల్లుకు వ్యతిరేకతను ఎదుర్కొనే బదులు.. మండలినే రద్దు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే మండలి రద్దు సాధ్యపడుతుందా.. చరిత్ర,రాజ్యాంగం ఏం చెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
మండలి గురించి...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం ప్రతీ రాష్ట్రానికి శాసనసభ ఉండి తీరాలి. కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి రెండూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్ ఆ కోవలోకి వస్తాయి. మిగతా రాష్ట్రాల్లో కేవలం శాసనసభ మాత్రమే అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17(1) ప్రకారం శాసనమండలి సభ్యుల సంఖ్య 40కి తక్కువ ఉండరాదు. అలాగే అసెంబ్లీ మొత్తం సభ్యత్వంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండరాదు.
మండలి రద్దు చేయాలంటే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం మండలిని రద్దు చేయాలంటే అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం పాస్ అవాలి. ఆ తర్వాత దాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి. ఆపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. శాసనమండలి లేని రాష్ట్రాల్లో శాసనమండలిని ఏర్పాటు చేయాలన్నా.. పునరుద్దరించాలన్నా... ఇదే విధానాన్ని అవలంభించాలి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలు పంపించే ఈ బిల్లులపై ఎలా స్పందిస్తుందన్నదే ఇక్కడ కీలకం. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నా.. లేక రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రానికి సఖ్యత ఉన్నా.. ఆ బిల్లులు గట్టెక్కడం అంత కష్టమేమీ కాకపోవచ్చు.
అప్పట్లో రాజీవ్ గాంధీ సానుకూలంగా వ్యవహరించడంతో..
1985లో
తిరుగులేని
మెజారిటీతో
ఎన్టీఆర్
ముఖ్యమంత్రి
అయిన
నాలుగు
నెలలకే
శాసనమండలిని
రద్దు
చేస్తూ
అసెంబ్లీలో
తీర్మానం
చేశారు.
అప్పుడు
కేంద్రంలో
కాంగ్రెస్
ప్రభుత్వం
అధికారంలో
ఉంది.
అయినప్పటికీ
అప్పటి
ప్రధాని
రాజీవ్
గాంధీ
ఎన్టీఆర్
సర్కార్
పంపించిన
మండలి
రద్దు
బిల్లును
పార్లమెంట్
ఉభయ
సభల్లో
పాస్
అయ్యేలా
చేశారు.
రాజీవ్
గాంధీ
పక్షపాత
వైఖరితో
వ్యవహరించకపోవడం
వల్ల
అది
సాధ్యపడింది.
అప్పట్లో
ఎన్టీఆర్
చేత
రద్దు
చేయబడిన
మండలి
మళ్లీ
వైఎస్
అధికారంలోకి
వచ్చాక
2007లో
పునరుద్దరించబడింది.
తమిళనాడులో ఏం జరిగింది..
మే 14,1986లో తమిళనాడులోని అప్పటి ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆమోదం పొందిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. దానికి పార్లమెంట్ ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. అలాగే అగస్టు 30,1986న రాష్ట్రపతి ఆమోద సంతకం చేశారు. నవంబర్ 1,1986 నుంచి ఆ చట్టం అక్కడ అమలులోకి వచ్చి మండలి రద్దయింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి ప్రభుత్వం ఫిబ్రవరి 20,1989లో శాసనమండలి పునరుద్దరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అదే సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మండలి పునరుద్దరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఈ రెండు బిల్లులు మే 10,1990లో రాజ్యసభలో ప్రవేశపెట్టబడ్డాయి. ఆ తర్వాత మే 28,1990న ఆమోదించబడ్డాయి. కానీ ఆ తర్వాత లోక్సభలో అక్టోబర్ 4,1991న బిల్లు వీగిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల్లో మండలి పునరుద్దరణ జరగలేదు.
జగన్ మండలిని రద్దు చేస్తారా..
సీఎం జగన్ మండలిని రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే.. అది పార్లమెంటులో ఆమోదం పొందవచ్చు లేదా తిరస్కరణకు గురవచ్చు. అది కేంద్రంతో ఆయనకున్న సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికి చాలా సమయం పట్టవచ్చు. అది ఏడాది అయినా రెండేళ్లయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి కేంద్రంతో సఖ్యత ఉంటేనే ఆయన ఈ విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉంది. మరో అంశమేంటంటే.. మండలిలో ప్రతీ ఏడాది లేదా రెండేళ్లకోసారి ఖాళీలు ఏర్పడుతాయి. అసెంబ్లీలో ఉన్న మెజారిటీ రీత్యా.. వైసీపీ సభ్యులనే మండలికి పంపించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివాళ్లను,పార్టీపై అసంతృప్తితో ఉన్నవాళ్లను ఈరకంగా బుజ్జగించవచ్చు. కాబట్టి జగన్ ఈ ఛాన్స్ను మిస్ చేసుకుంటారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది.
కేబినెట్ అత్యవసర భేటీకి ఛాన్స్..
ఏదేమైనా ఈ రాత్రికే మండలి రద్దుపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించి.. మండలి రద్దుకు నిర్ణయం తీసుకోవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మండలి పరిణామాలపై అటు రాజకీయ నాయకులతో పాటు ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.