పెద్ద కుదుపే: క్రెడిట్ జగన్ దేనా?.. పుణ్య కాలం గడిచిపోయాక బాబు అస్త్రం!
అమరావతి: ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చిన తర్వాత.. స్తబ్దుగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు రావడానికి టీడీపీ సిద్దపడటం ఆ కుదుపును మరింత తీవ్రం చేసింది.
Recommended Video
అంతా నాటకమేనా?: ఈ ప్రశ్నలకు బదులేది.. బాబు 'తెగదెంపుల' పర్వం వెనుక..
అయితే ఇన్నాళ్లు హోదా అంశాన్ని పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసమే కేంద్రంతో తెగదెంపులకు సిద్దపడటంలో క్రెడిట్ జగన్కే దక్కుతుందని ఆ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం.
ఇంత ఆలస్యంగానా?:
నాలుగేళ్ల పాటు కేంద్రంతో అధికారాన్ని పంచుకుని.. తీరా ఎన్నికలకు ఇక సంవత్సరం గడువు మాత్రమే ఉన్న వ్యవధిలో ఎన్డీయేతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడం ఒక డ్రామా అని వైసీపీ విమర్శిస్తోంది.
ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర కేబినెట్లో చేరామో ఆ లక్ష్యం నెరవేరనప్పుడు ఇంకెందుకు కొనసాగాలి? అని చంద్రబాబు చెప్పారు. అయితే ఈ పనేదో ఇంకాస్త ముందు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దానిపై క్లారిటీ లేదు:
ఇక మంత్రులతో రాజీనామా చేయిస్తున్నామని చెప్పారే తప్ప.. కేంద్రం నుంచి వైదొలుగుతున్నట్టు చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు. దీంతో ఈ విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.
పైగా తన నిర్ణయాన్ని ప్రకటించడం కన్నా ముందే ప్రధాని మోడీకి ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడం ద్వారా.. వారితో సఖ్యతను చంద్రబాబు కోరుకుంటున్నారన్న విషయం మరోసారి తేటతెల్లమైందంటున్నారు.
పుణ్యకాలం గడిచిపోయాక..:
హోదాను పక్కనపెట్టి ప్యాకేజీని భుజానికెత్తుకున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కూడా సాధించడంలో విఫలమైంది. అయితే కేంద్రంతో మొండి వైఖరి అవలంభిస్తే జరిగే పనులు కూడా జరగవని చంద్రబాబు ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు. కానీ పుణ్య కాలం కాస్త గడిచిపోయాక.. ఇప్పుడు రాజీనామా అస్త్రాలు సంధించడం ద్వారా ఉపయోగం ఉంటుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
క్రెడిట్ తమదే అంటున్నారు..:
ఇకపోతే కేంద్రంతో ఇన్నాళ్లు నాన్చుడు ధోరణికే పరిమితమైన టీడీపీ.. రాజీనామాలకు సిద్దపడే దాకా వచ్చిందంటే ఆ క్రెడిట్ తమదేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించిన తర్వాతే.. టీడీపీలో చలనం వచ్చిందని, ఆ క్రమంలోనే చంద్రబాబు నుంచి తాజాగా ప్రకటన వచ్చిందని వారు చెబుతున్నారు. తాము హోదాపై బలంగా గొంతెత్తడం వల్లే.. టీడీపీ ఈనాడు ఆ అనివార్యతలో చిక్కుకుందంటున్నారు.