వైసిపి వైపు వేలు: జగన్కు చంద్రబాబును ప్రశ్నించే నైతికత లేదా?
అమరావతి: తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి కౌంటర్ వచ్చింది. మీ పార్టీలోనే మద్యం వ్యాపారులు ఉన్నారని వేలెత్తి చూపిస్తున్నారు.
పార్టీలో మద్యం వ్యాపారులను పెట్టుకొని మద్య నిషేదం విధిస్తామని చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేస్తున్నారు. మొదట వారి పైన చర్యలు తీసుకున్నాక మద్య నిషేధం గురించి మాట్లాడాలని అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నేతలు కూడా పార్టీలోని మద్యం వ్యాపారుల పైన గుర్రుమంటున్నారు.
టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు బుధవారం జగన్ పైన, ఆయన పార్టీ పైన దుమ్మెత్తిపోశారు. పార్టీలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావుల వంటి మద్యం వ్యాపారులను పెట్టుకొని మాట్లాడటం ఏమిటన్నారు. గతంలో బొత్స స్వయంగా తాను మద్యం వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు.
పార్టీలోని మద్యం వ్యాపారుల పైన చర్యలు తీసుకున్న తర్వాతనే జగన్... చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఆ తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ప్రకటించాలని చెబుతున్నారు. అప్పటిదాకా జగన్కు చంద్రబాబుకు ప్రశ్నించే నైతిక హక్కు లేదంటున్నారు.
టిడిపి నేతల కౌంటర్ నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా స్పందించారు. తమ పార్టీ సంపూర్ణ మద్య నిషేధం గురించి నిర్ణయం తీసుకుందని, అలాంటప్పుడు పార్టీలోని నేతలు మద్యం వ్యాపారం చేయడం మానేయాలని హితవు పలికారు.