జగన్ మాట మీద నిలబడ్డారా..మడమ తిప్పారా : వివాదాలు..వరాలు..వైఫల్యాలు : ఆరు నెలల పాలన పూర్తి..!
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే..జగన్ చేసిన తొలి ప్రసంగం లో..ఆరు నెలల్లోనే మా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే గొప్ప ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను. పరిపాలన అంటే ఏమిటో చూపిస్తాను. ఆరు నెలల్లోనే దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..అంటూ మాట ఇచ్చారు.
నేటితో జగన్ పాలనకు ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆరు నెలల కాలంలో రాజకీయంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు..వివాదాస్పద నిర్ణయాలు..నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు. ఇవన్నీ కలిసి జగన్ రాజకీయంగా ఆరు నెలల పాలన. మరి..జగన్ తన మాట నిలబెట్టుకున్నారా..ఈ ఆరు నెలల్లో మంది సీఎంగా అనిపించుకున్నారా..
జగన్ పాలనకు ఆరు నెలలు పూర్తి..
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ పాలన ఆరు నెలలు పూర్తి చేసుకుంది. తాను ఆరు నెలల్లోగా మంచి సీఎం అనిపించుకుంటానని ఎన్నికల ఫలితాల నాడు ప్రకటించారు. మరి..ఇప్పుడు జగన్ మంచి సీఎం అనిపించు కున్నారా లేదా అనేది వైసీపీ నేతల చర్చ. ప్రజలకు ఇచ్చిన హామీల పరంగా మాత్రం ముఖ్యమంత్రి చన్నపాటి సర్దుబాట్లతో మాట మీద నిలబడ్డారు.
తొలి ఆరు నెల్లోనే అనేక హామీలను అమల్లోకి తీసుకురాగా.. మరి కొన్నింటికి అమలు చేసే తేదీలను ప్రకటించారు. అదే సమయంలో రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ లో తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గించి...బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ..కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. కేబినెట్ లో అనుసరించిన సామాజిక కూర్పు సైతం అందరి అభినందనలు అందుకున్నది.
తొలి కేబినెట్..తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే..
ఇక, కేబినెట్ ఏర్పాటు అయిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం..ఉద్యోగులు 27 శాతం ఐఆర్ అమలుకు నిర్ణయించారు. అదే విధంగా పారిశుద్ద కార్మికులు..ఆశా వర్కర్లు..అంగన్ వాడీ సిబ్బంది వంటి వారికి జీతాలు పెంచారు. సీపీఎస్ అమలు పైన కమిటీ నియమించారు. అటో డ్రైవర్లకు పది వేలు చొప్పున అందించారు. అదే విధంగా అగ్రి గోల్డ్ బాధితులకు సాయం అందచేసారు. ఇక, తొలి అసెంబ్లీ సమావేశాల్లో 75 శాతం స్థానిక రిజర్వేషన్, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్ల అమలు..సచివాలయ వ్యవస్థ.. కొత్త ఉద్యోగాల క్పలన వంటి వాటికి ఆమోదం తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసారు.
సంక్షేమం ఫుల్..అభివృద్ధి నిల్
మొదటి ఆరు నెలల కాలంలో ముఖ్యమంత్రి పూర్తి సంక్షేమం పైనే ఫోకస్ చేసారు. నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధి మీద అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వైయస్సార్ రైతు భరోసా.. వేతనాలు పెంపు.. భారీగా ఉద్యోగ కల్పన..వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాలు అమలు చేసారు. ఇక, రాజధాని అమరావతి పనులు పూర్తిగి నిలిచిపోయాయి. పోలవరం పైన రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు తిరిగి ప్రారంభించారు. అనేక పరిశ్రమలు పెట్టుబడులు ఉప సంహరించుకున్నాయి. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు మొదలైంది. అవినీతి పైప యుద్దం పేరుతో గతం కంటే అవినీతి తగ్గినట్లుగా జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. కానీ, అభివృద్ధి విషయంలో మాత్రం ఆలోచన చేయటంలేదనే వాదన ఉంది. కీలకమైన అమ్మఒడి.. నేతన్న హస్తం ప్రారంభ ముహూర్తాలు ఖరారు చేసారు.
వివాదాలు..వైఫల్యాలు
రాజధాని నిర్మాణం నిలిపివేయటం ముఖ్యమంత్రి జగన్ వైఫల్యంగా ప్రచారం సాగుతోంది. అదే విధంగా.. ప్రజా వేదిక కూల్చివేత..అన్నా క్యాంటీన్ల మూసివేత పైన వ్యతిరేకత కనిపించింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష పెద్ద దుమారానికి కారణమైంది. ఇక, ఇసుక సమస్య ముఖ్యమంత్రిని రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసినా..కొత్త పాలసీతో గాడిలో పెట్టారు. ఇక, ఇంగ్లీషు మీడియం నిర్ణయం సైతం జగన్ పైన విమర్శలకు కారణమవుతోంది. అయితే, ప్రజల్లో మాత్రం ఈ నిర్ణయానికి మద్దతు కనిపిస్తోంది.ఇక, కొత్తగా ఆరోగ్య శ్రీ నిర్ణయాలు సైతం ప్రజలకు నమ్మకం పెంచాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల ప్రజా ధనం ఆదా చేయగలుగుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.
ఇలా..సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సాగుతున్న జగన్ పాలన లో ఈ ఆరు నెలలు రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. పాలన పరంగా జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారా లేదా అనేది త్వరలో జరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్లడయ్యే ప్రజాభిప్రాయాం ద్వారానే స్పష్టం కానుంది.