అప్పటికీ.. ఇప్పటికీ ఇదీ తేడా?: జగన్ పాదయాత్ర వైఎస్ మ్యాజిక్ను రిపీట్ చేస్తుందా?..
అప్పటి ప్రభుత్వ వ్యతిరేకతకు, వైఎస్ తీసుకున్న రిస్క్కు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు జగన్ చేయబోయే పాదయాత్రకు 'రిస్క్' అనే సానుభూతేమి తోడుకాదు.
హైదరాబాద్: రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలవాలంటే సంచలనమేదైనా నమోదు కావాలి. ఆగర్భ శత్రవు లాంటి ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే.. హడావుడిగా రంగంలోకి దిగితే సరిపోదు. పక్కా ప్రణాళికతో.. ప్రత్యర్థి ఊహించని టైమింగ్లో రంగంలోకి దిగాలి. సరిగ్గా జగన్ అలాంటి పనే చేశారు.
జగన్!.. ఆ హామి సాధ్యమయ్యే పనేనా?: కానీ, ఇలా చేస్తే.. తిరుగుండకపోవచ్చు?
పద్నాలుగేళ్ల క్రితం తన తండ్రి పొలిటికల్ జర్నీని మలుపుతిప్పిన పాదయాత్రనే ఇప్పుడు తానూ అస్త్రంగా మలుచుకోబోతున్నారు. జగన్ పాదయాత్ర ఊహించిన అంశమే అయినప్పటికీ.. ఇంత త్వరగా ఆ నిర్ణయం తీసుకుంటారని, అదీ పార్టీ ప్లీనరీలోనే ప్రకటిస్తారని ఎవరూ అనుకోలేదు.
'పనికిరాడనే తెరపైకి ప్రశాంత్ కిషోర్, ఆ రోజు జగన్ పాదయాత్రనా, కోర్టుకా?'
మొత్తంగా గెలుపే పరమావధిగా పాదయాత్రతో తన రాజకీయాలను మరో ఎత్తుకు చేర్చాలని జగన్ భావిస్తున్నారు. తండ్రి బాట తనకూ కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు. మరి వైఎస్ను ఆదరించిన ప్రజలు జగన్ను ఆదరిస్తారా?.. జగన్ విషయంలో పాదయాత్ర ఎంతమేర వర్కౌట్ అవుతుంది? అన్నది ప్రస్తుతం ఇటు మీడియాలోను, అటు జనంలోను తీవ్ర చర్చను రేకెత్తేలా చేసింది.
అప్పట్లో అదో రిస్క్?:
2003లో వైఎస్ పాదయాత్ర నిర్ణయం ఒక సంచలనాన్ని రేకెత్తించింది. టీడీపీ హవా ముందు చిన్నబోయిన కాంగ్రెస్ కొత్త రక్తం ఎక్కించింది. పొలిటికల్ రిస్క్ తీసుకుని పార్టీని పట్టాలెక్కించే సాహసం కాంగ్రెస్లో అంతదాకా ఎవరూ చేయలేదు. అనూహ్యంగా సోనియా గాంధీ ముందు పాదయాత్ర ప్రతిపాదన పెట్టిన వైఎస్.. వారికి నమ్మకం కలిగించడంలో సఫలమయ్యారు.
వైఎస్కు కలిసొచ్చిందిలా?
హైకమాండ్ అండతో పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆ తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడమూ జరిగింది. అయితే ఇదంతా ఒక్క పాదయాత్ర వల్లే సాధ్యపడిందా? అంటే కచ్చితంగా కాదనే సమాధానం కూడా వినిపిస్తోంది. అప్పటికే తొమ్మిదేళ్లు చంద్రబాబు సీఎంగా కొనసాగడంతో.. ఆయన విధానాల పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైంది.
ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు ఆయన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండేవి. ఉద్యోగ వర్గాలకు తోడు రైతుల్లోను ఆయన పట్ల ఏర్పడిన వ్యతిరేకతను వైఎస్ పాదయాత్ర ద్వారా తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. అలా చంద్రబాబు వ్యతిరేకత కూడా వైఎస్కు కలిసొచ్చిందనే చెప్పాలి.
ఇప్పుడు పరిస్థితి వేరు?:
ఒకప్పుడు వైఎస్ పాదయాత్ర చేసిన పరిస్థితులకు.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పూర్తిగా భిన్నం. అప్పటి ప్రభుత్వ వ్యతిరేకతకు, వైఎస్ తీసుకున్న రిస్క్కు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు జగన్ చేయబోయే పాదయాత్రకు 'రిస్క్' అనే సానుభూతేమి తోడుకాదు.
పైగా రాష్ట్రంలో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అది పూర్తి స్థాయిలో బహిర్గతం కాలేదు. దాన్ని తట్టిలేపడం వైసీపీకే పెద్ద సవాలే. ముఖ్యంగా హోదా విషయంలో టీడీపీని దులిపేసిన వైసీపీ.. ఇప్పుడు బీజేపీకి దగ్గరవుతూ ఎలాంటి సంకేతాలిచ్చిందో జనం గమనిస్తూనే ఉన్నారు.
దీనికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి రాజధానిని నిర్మించడానికి చంద్రబాబే కరెక్ట్ అని జనం నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం కొంతమేర సడలి ఉంటుందా? ప్రజల్లో సెంటిమెంటును జగన్ బ్రేక్ చేస్తారా? అన్నదానిపై వైసీపీ విజయం ఆధారపడవచ్చు.
జగన్ పాదయాత్రను అడ్డుకుంటే?:
కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకే ప్రభుత్వం అనుమతినివ్వని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయి. హోదా కోసం జగన్ గుంటూరులో నిరాహార దీక్ష చేసిన సమయంలోను ప్రభుత్వం దాన్ని భగ్నం చేసింది. భద్రతా కారణాలు, అనారోగ్య పరిస్థితులు.. అంటూ దీక్షను అడ్డుకుంది.
ఇలాంటి తరుణంలో.. జగన్ పాదయాత్ర అంత సజావుగా సాగుతుందా? అన్నది అనుమానమే. చంద్రబాబు జగన్ పాదయాత్రకు అడ్డుపడే అవకాశం లేకపోలేదు. ఏదో ఒక సాకుతో ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం జరగకమానదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. జగన్ ఎలా ప్రతిస్పందిస్తారనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
అధికారమే దాసోహమన్న విమర్శ:
ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలన్నదే జగన్ లక్ష్యం అని టీడీపీ పదేపదే విమర్శిస్తూనే ఉంది. ఇప్పుడు పాదయాత్ర అంశాన్ని కూడా దానితోనే ముడిపెట్టేస్తారు. తమతో తలపడలేకే ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారని అప్పుడే విమర్శలు మొదలుపెట్టిన టీడీపీ.. పాదయాత్ర విషయంలో తమదైన రీతిలో విరుచుకుపడే అవకాశం ఉంది.
జగన్ సైతం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా.. అధికారం కోసమే ప్రయత్నిస్తున్నట్లుగా వ్యవహరిస్తే.. అది కూడా టీడీపీకే అనుకూలంగా మారుతుంది. కాబట్టి జగన్ ఈ విమర్శను దాటుకుని ముందుకెళ్తేనే పాదయాత్రకు ఫలితం దక్కుతుంది.