కుల సమీకరణాల్లో జగన్ లెక్క తప్పిందా ?
ఏపీ స్ధానిక సంస్ధల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు వ్యవహారం కాక రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇప్పటికే తమకు దూరమైన బీసీలకు ఆకట్టుకునేందుకు విపక్ష టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తామని కూడా ప్రకటించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కుల సమీకరణాల్లో జగన్ లెక్క తప్పిందా అన్న చర్చ మొదలైంది.
జగన్ విజయం వెనుక కుల సమీకరణం
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం వెనుక ఇతర కారణాలతో పాటు కుల సమీకరణాల పాత్ర ఎంతో ఉంది. గతంలో టీడీపీకి తప్ప మిగతా పార్టీలకు ఓటు వేసేందుకు ఇష్టపడని ఎన్నో కులాలు జగన్ కు తొలిసారిగా అండగా నిలిచాయి. ఇందులో బీసీలది ప్రధాన పాత్ర. దశాబ్దాలుగా బీసీలకు అండగా నిలిచిన బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో టీడీపీ విఫలం కావడంతో తొలిసారి జగన్ ఇచ్చిన హామీలను వారు నమ్మారు. అనంతపురం వంటి పెద్ద జిల్లాల్లో వైసీపీ అప్రతిహత విజయాలకు ఇదే కారణమైంది.
అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారు ?
వైసీపీ అధికారం చేపట్టాక బీసీలకు తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. వారిని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు 50 శాతం కోటాతో రిజర్వేషన్లు కల్పించారు. బీసీలకు క్యాబినెట్ తో పాటు మిగతా పదవుల్లో అవకాశమిచ్చారు. అయితే తొలిసారిగా తము అండగా నిలిచిన బీసీలకు మరింత మేలు చేయడం ద్వారా వారి ఓటు బ్యాంకును సుస్ధిరం చేసుకోవాలన్నది జగన్ ఆలోచన.
స్దానిక సంస్ధల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, తగ్గింపు
వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేదు. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన ఎన్నికలు 9 నెలల తర్వాత సాకారం అయ్యే పరిస్దితి. అయితే ఇక్కడే జగన్ ఓ తప్పు చేశారు. 50 శాతం మించి రిజర్వేషన్లు ఉండరాదన్న సుప్రీంకోర్టు, హైకోర్టుల ఉత్తర్వులను పక్కనబెట్టి బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో దాన్ని 9.85 శాతం మేర తగ్గించేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు ఇదే వివాదాస్పమవుతోంది. తమ బీసీ ఓటు బ్యాంకును జగన్ లాగేసుకున్నాడన్న కోపంతో ఉన్న చంద్రబాబు సహా టీడీపీ నేతలు బీసీ రిజర్వేషన్ల తగ్గింపును రాజకీయం చేయడం మొదలుపెట్టేశారు.
Recommended Video
బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని జగన్ ఎదుర్కోనేదెలా
బీసీ రిజర్వేషన్ల తగ్గింపులో సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోని జగన్ సర్కారు... ఇప్పుడా విషయాన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశమని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఓసారి రిజర్వేషన్లు ప్రకటించి దాన్ని తగ్గించడం లేదా తొలగించడం సాధ్యం కాని పని. అలా చేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కీలకమైన స్ధానిక ఎన్నికల సమయంలో జగన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
బీసీ రిజర్వేషన్ల వ్యవహారం గమనిస్తే రాజకీయంగా ఓ అడుగు వేయాలన్నా, వెనక్కి తీసుకోవాలన్నా కష్టమనే సామెతను నేతలు ఎందుకు అంతగా వంట బట్టించుకుంటారో ఇట్టే అర్ధమవుతోంది.