జనసేనలో ఏమి జరుగుతోంది..? దళిత ఎమ్మెల్యే పై పార్టీ వివక్ష చూపుతోందా?
అమరావతి: జనసేన పార్టీ నుంచి శాసనసభ ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ అగ్ర నాయకత్వం నుంచి వివక్షను ఎదుర్కొంటున్నారా? కులాలు, మతాలకు అతీతంగా సరికొత్త రాజకీయాలను పరిచయం చేస్తానంటూ సినిమాటిక్ డైలాగులను వల్లించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. దళిత ఎమ్మెల్యే రాపాకను దూరంగా పెట్టారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది సోషల్ మీడియా. ఫొటోలతో సహా సాక్ష్యాలను చూపిస్తోంది. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూరకంగా కలుసుకున్న జనసేన పార్టీ ప్రతినిధుల బృందంలో రాపాక వరప్రసాద్ కు చోటు కల్పించకపోవడం దీనికి నిదర్శనమని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రాపాక వరప్రపాద్ ను పార్టీ అగ్ర నాయకత్వం దూరం పెట్టిందనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు.
రాపాకను దూరం పెట్టిన పవన్
చాలా రోజుల తరువాత రాజకీయ తెరపైకి వచ్చారు పవన్ కల్యాణ్. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను మంగళవారం విజయవాడలోని రాజ్ భవన్ లో మర్యాదపూరకంగా కలుసుకున్నారు. తన సోదరుడు నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్, పాలవలస యశస్విని, మనుక్రాంత్రెడ్డి, పార్టీ లీగల్సెల్ కో ఆర్డినేటర్ ప్రతాప్ ఉన్నారు. అక్కడిదాకా బాగానే ఉంది. తమ వెంట రాపాక వరప్రసాద్ ను తీసుకెళ్లలేదు. ఆయనను దూరంగా పెట్టారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అయినప్పటికీ- గవర్నర్ ను కలిసిన ప్రతినిధుల బృందంలో రాపాకు చోటు దక్కలేదు. దీనిపై సోషల్ మీడియా జనసేన పార్టీని ఓ రేంజ్ లో ఆడుకుంటోంది. జనసేన పార్టీ దళిత వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదని నెటిజన్లు, ట్విట్టరెట్టీలు విమర్శిస్తున్నారు. దళిత ఎమ్మెల్యే కావడం వల్ల రాపాకను దూరంగా పెట్టారని ఆరోపిస్తున్నారు.
దళితుడైనందుకేనా.. అన్నకు చోటు ఎలా ఇచ్చారు?
ఈ విమర్శలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేయనట్టే కనిపిస్తోంది జనసేన పార్టీ అగ్ర నాయకత్వం. సరికొత్త రాజకీయాలు చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. దళిత ఎమ్మెల్యేపై వివక్ష చూపడమేనా సరికొత్త రాజకీయం అంటే? అని నిలదీస్తున్నారు. కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక దళిత ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని గవర్నర్ వద్దకు వెళ్లకుండా.. తన సోదరుడు నాగబాబు, ఇతర అగ్ర కులాలకు చెందిన నాయకులను మాత్రమే తీసుకుని వెళ్లడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతంతో పవన్ కల్యాణ్, ఆయన పార్టీ మరోసారి దళిత వ్యతిరేకి అనే ముద్రను వేయించుకుందని మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఒక్క నాదెండ్ల మనోహర్ కు తప్పితే మరెవరికీ అనుభవం లేదని, అలాంటి వారిని తన చుట్టూ చేర్చుకున్న పవన్ కల్యాణ్ పార్టీని ఏ విధంగా గెలిపించుకుంటారని అంటున్నారు.