ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా: ఆకస్మిక నిర్ణయం చర్చ
Recommended Video
అమరావతి: ఆంధప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎంపీ కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు.. ఆ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. తాను అధ్యక్షుడిగా నాలుగేళ్లు పని చేశానని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు తెలిపారు. కొత్త కమిటీ మరో మూడు నాలుగు వారాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఏడాదిలో ఎన్నికలు.. అందుకే..
వచ్చేది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన కంభంపాటి.. యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు హరిబాబు.
చర్చనీయాంశంగా రాజీనామా
కాగా, ఇంత అకస్మాత్తుగా హరిబాబు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవిని ఆయన తనకు తానుగా వదులుకున్నారా? లేక అధిష్ఠానం సూచన మేరకే రాజీనామా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
టీడీపీ, బీజేపీల విమర్శలు
ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ-బీజేపీ మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీలోని ఓ వర్గం నేతలు టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
చర్చనీయాంశంగా రాజీనామా
అయితే, హరిబాబు మాత్రం ఈ విషయంలో పూర్తిగా సంయమనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించి మరొకరిని నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో హరిబాబు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా, హరిబాబు రాజీనామా నేపథ్యంలో కొత్త కమిటీపై బీజేపీ కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.