టీడీపీలోకి కొణతాల?: జాప్యం ఎందుకు, గురువుతో తెగదెంపులేనా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు ఈ నెల 28న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి రాజకీయ గురువు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా టీడీపీలో చేరతారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ముఖ్యుడిగా వ్యవహారించిన కొణతాల రామకృష్ణ ఆయన మరణాంతరం జగన్కు అండగా నిలిచారు. వైయస్ జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నెంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. అయితే ఆయన శిష్యుడు గండి బాబ్జీని అకారణంగా పెందుర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారంటూ జగన్పై కొణతాల లేఖాస్త్రం సంధించారు.
ఆలా మొదలైన వివాదం వైసీపీ నుంచి కొణతాల బయటకు వచ్చేలా చేసింది. ఈ సమయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలోకి చేరనున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొణతాల రాకను జిల్లాకు చెందిన మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.
ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొణతాల టీడీపీలో చేరాలా? వద్దా? అనే మీమాంసలో ఉండిపోయారు. టీడీపీలో చేరడంపై స్వయంగా చంద్రబాబును కలిసి వ్యక్తిగతంగా మాట్లాడాలని కొణతాల భావించినా, అందుకు వీలు చిక్కలేదు.
అయితే తాజాగా కొణతాల శిష్యులైన కిడారి సర్వేశ్వరరావు, గండి బాబ్జీలు తెలుగుదేశం పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకోవడంతో మరోసారి తెరపైకి కొణతాల పేరు వచ్చింది. కొణతాల చేరిక విషయంలో జాప్యం జరుగుతుండడంతో ఆయనతో సంబంధం లేకుండానే కిడారి, గండి బాబ్జీ టీడీపీలే చేరాలని నిర్ణయించుకున్నారు.
త్వరలోనే కొణతాల కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వీరితోపాటు విశాఖ ఏజెన్సీకి చెందిన కొంతమంది మండల, గ్రామ స్థాయి వైసీపీ ప్రజాప్రతినిధులు, కొందరు కొణతాల అనుచరులు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈనెల 20, 21 తేదీల్లో నర్సీపట్నం మరిడిమాంబ జాతరకు విచ్చేసిన కిడారి, గండి బాబ్జీలతో పాటు జిల్లాకు చెందిన నేతలు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడితో సుదీర్ఘ చర్చలు జరిపి చేరిక ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొణతాల రామకృష్ణతో నిమిత్తం లేకుండా వీరిద్దరూ తెలుగుదేశంలో చేరబోతుండటం విశేషం.