టీటీడీలోకి రమణ దీక్షితులు రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా ? జగన్ ఏం చెయ్యబోతున్నారు ?
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతోందా ? . బుధవారం రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారా ? జగన్ రమణ దీక్షితుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారా ? అంటే అవును అనే సంకేతాలు వస్తున్నాయి.
94 శాతం ఏపీ ఎమ్మెల్యేలు కరోడ్పతులే .. ఆస్తుల్లో బాబు ఫస్ట్, జగన్ సెకండ్
టీటీడీలోకి రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న రమణ దీక్షితులు
టీటీడీ ప్రధానార్చక పదవి నుండి తొలగించబడి గతంలో వివాదాలకు కారణమైన రమణ దీక్షితులు టీటీడీలో రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నాడు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఈ నేపధ్యంలో రమణ దీక్షితులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిసి ఈ మేరకు తన విజ్ఞప్తిని తెలియజేశాడు. దీంతో జగన్ రమణ దీక్షితులకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ ను కలిసిన రమణ దీక్షితులు .. ఆలయంలో కలుద్దామన్న జగన్
పద్మావతి అతిథి గృహంలో బస చేసిన వైయస్ జగన్ ను కలిసేందుకు వెళ్ళారు రమణ దీక్షితులు . ఆయనను చూసిన వైయస్ జగన్ బుధవారం ఆలయంలో కలుద్దామని చెప్పారు. తనను ఆలయంలోకి అనుమతించడం లేదని తాను ఇప్పుడే కలుస్తానని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. తాను ఉన్నానని బుధవారం ఆలయంలో కలుద్దామని చెప్పడంతో తన రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతుందన్న ఆనందంలో వెళ్లిపోయారు రమణ దీక్షితులు. మరి నేడు ఆలయంలో రమణ దీక్షితుల విషయంలో ఏం జరగనుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తీతీదీలో వివాదాలకు ఆర్ఘ్యం పోసిన రమణ దీక్షితులు .. టీడీపీ పాలనపై బహిరంగ విమర్శలు
టీటీడీలో గతంలో వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచారు రమణ దీక్షితులు . రమణ దీక్షితులు ఎన్నికల ఫలితాలకు ముందు కడప వెళ్లి వైయస్ జగన్ ను కలిశారు. వైయస్ జగన్ కు ఆశీస్సులు అందించారు. అలాగే తమ తొలగింపుపై పునరాలోచించాలని జగన్ ను కోరారు. తిరిగి తమను స్వామి వారి కైంకర్యాలకు అవకాశం ఇవ్వాలని ఆయన పదేపదే జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపైనా రమణ దీక్షితులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. టీటీడీలో జరిగే పరిణామాలపై ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు రమణ దీక్షితులు.
రమణ దీక్షితులు కి గతంలో మద్దతు పలికిన జగన్ .. ఇప్పుడు ఆలయంలో రీ ఎంట్రీకి అవకాశం ఇస్తారా ?
తిరుమల లో జరిగిన త్రవ్వకాలపై వచ్చిన ఆరోపణలు చెయ్యటం, బిజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాకు స్వాగతం పలకటం, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో చర్చలు వంటి పరిణామాల నేపథ్యంలో అతనిపై టీటీడీ వేటు వేసింది.పాత ఉత్తర్వుల ఆధారంగా ప్రధాన ఆర్చకుల హోదా నుంచి తొలిగించారు. రమణ దీక్షితుల తొలగింపుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గులాబీ రంగు వజ్రం పోయిందని చెప్పటం , స్వామి వారి ఆభరణాలకు రక్షణ లేదని చెప్పటం వంటి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసి టీటీడీని వివాదాస్పదం చేశారు . అప్పుడు వైసీపీ రమణ దీక్షితులకు మద్దతు పలికింది. ఇక ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో రమణ దీక్షితులు రీ ఎంట్రీ అంశం ఆసక్తికరంగా మారింది.