లోకేష్ అక్కడకు వెళ్లింది..."ఆపరేషన్ మాచర్ల" కోసమేనా?...ఔనంటున్నారు!
గుంటూరు:ఆ నియోజకవర్గంలో టిడిపి గెలుపు మొహం చూసి పదేళ్లయింది. తెలుగుదేశం పార్టీకి పట్టున్నా అనూహ్య కారణాలతో కునారిల్లిన ఆ నియోజకవర్గాన్ని మళ్లీ తమ ఖాతాలో వేసుకోవడానికి చినబాబు లోకేష్ నడుంబిగించారు.
అందుకే ఏరికోరి అక్కడకు పర్యటన పెట్టుకున్నారు. అనుకున్నట్లే ఇక్కడ లోకేష్ యాత్ర సూపర్ సక్సెసయింది. అందుకు తగినట్లుగానే లోకేష్ కూడా ఈ నియోజకవర్గం అభివృద్ది పనులకు భారీగా నిధులు మంజూరు చేశారు. దీంతో లోకేష్ పర్యటన తరువాత ఇక్కడి పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. కేడర్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై నమ్మకం ధృవపడుతోంది. ఇదీ లోకేష్ "ఆపరేషన్ మాచర్ల" ఎఫెక్ట్...వివరాల్లోకి వెళితే...
మాచర్లలో...టిడిపి పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు...గుంటూరు జిల్లాలోని చివరి నియోజకవర్గమైన మాచర్ల లో టిడిపి చివరి మూడు ఎన్నికల్లో పరాజయం పాలైంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా విజయబావుటా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ...అందుకోసం మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఆపరేషన్ మాచర్ల ప్రారంభించినట్లు కనిపిస్తోంది. మంగళవారం మాచర్ల పర్యటనకు విచ్చేసిన లోకేశ్ ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
వరాల జల్లు...నిధుల వెల్లువ
పక్కా ప్రణాళిక ప్రకారమే మంత్రి లోకేష్ ఆపరేషన్ మాచర్లకు తెరలీసి అందులో భాగంగానే తన ఇక్కడి పర్యటనలో వరాల జల్లు కురిపించారన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. ఇక్కడ 2004 నుంచి కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఒరిగిందేమీ లేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జగన్మోహన్రెడ్డి వెంట నడవడంతో ఇక్కడ అభివృద్ధికి తోడ్పాటు లేక కుంటుపడిపోయింది. తాగునీటి కోసం సతమతమయ్యే పల్లెలు, పూర్తి కాని ఎత్తిపోతల పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే ఆటోమేటిక్గా జనాదరణ పొదవచ్చని అంచనా వేసిన మంత్రి లోకేశ్ ఏకంగా రూ.215 కోట్లు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు.
హామీలపై స్పష్టత...లక్ష్యం దిశలో
నియోజకవర్గం పరిధిలోని వరికపూడిశెల ఎత్తిపోతలకు ఒకసారి చంద్రబాబు, మరోసారి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసినా అభివృద్దిలో ముందుడుకు నోచుకోలేదు. ఈ క్రమంలో ఈసారి లోకేష్ ఈ ప్రాజెక్ట్ పై స్పష్టమైన హామీ ఇచ్చారు. అభివృద్ధి చేసి చూపిస్తే ఇక్కడి వాళ్ల మనసులు గెల్చుకోవచ్చనే ధీమాతో లోకేష్ అదే దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పటివరకూ ఈ నియోజక వర్గంలో టీడీపీలో నెలకొన్న వర్గపోరు ఆ పార్టీకి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు కూడా వీటి నివారణకు ఎంతో ప్రయత్నాలు చేయగా తాజాగా లోకేష్ ఎంట్రీతో పరిస్థితి చక్కబడినట్లు కనిపిస్తోంది.
నూతనోత్సాహంతో...పార్టీ క్యాడర్
మాచర్ల నియోజకవర్గానికి విచ్చేసిన లోకేష్ కు ఇక్కడి జనాలు బ్రహ్మరథం పట్టడంతో పార్టీ కేడర్కి కొత్త ఊపు వచ్చింది. లోకేశ్ పర్యటన సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక ఈ నియోజకవర్గాన్ని తాము చేజిక్కించు కోవడం అంత కష్టం కాదనే అభిప్రాయం టిడిపి శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరికొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న క్రమంలో ఇక నుంచి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ ఇక్కడి రాజకీయాలను పర్యవేక్షిస్తూ తామే విజయానికి బాటలు పరవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి లోకేష్ ఆపరేషన్ మాచర్ల అంతిమ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో వేచిచూడాలి.