పాలు పోసిన మోత్కుపల్లి: టీడీపీపై వైఎస్ జగన్ దాడి తేలికేనా?
తెలుగునాట అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి తెలంగాణలో రాజకీయ పరిణామాలు తదనుగుణంగా మారుతున్నాయి. తెలంగాణలో రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం మొదలైం
హైదరాబాద్/ అమరావతి: తెలుగునాట అప్పుడే 'రాజకీయాలు' వేగం పుంజుకున్నాయి. దాదాపు మరో ఏడాదిన్నర కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో సమీకరణాలు మారుతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి 'రాజకీయ' అస్త్రంగా మారుతుందా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
మంగళవారం దేశ రాజధాని నగరం 'హస్తిన' సాక్షిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో అట్టహాసంగా 'హస్తం' పార్టీ జెండా కప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నదని టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రకటన ఆ పార్టీలో సంచలనాలకు కారణమైంది.
సరైన సమయంలో తీసుకుంటామని చంద్రబాబు దాటవేత
మోత్కుపల్లి ప్రకటన తర్వాత ఆగమేఘాలపై టీటీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు.. పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని దాటేశారు. పొత్తులపై స్పష్టతనివ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని చేసిన రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. ఈ లోగా చంద్రబాబు విదేశీ పర్యటన.. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లి రహస్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. చివరకు పరిణామాలు రేవంత్ రెడ్డి సహా టీటీడీపీ నేతలు, కార్యకర్తలు ‘సైకిల్' దిగి స్నేహ ‘హస్తం' అందుకునేందుకు హస్తిన దారి పట్టేలా చేశాయి. ఈ క్రమంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం.
స్పందించని చంద్రబాబు.. దాటవేసిన ఏపీ మంత్రులు
పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మంత్రులు యనమల రామక్రుష్ణుడు, పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్లపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా స్పందించనే లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకుంటే సీమాంధ్ర నేతలకు కాంట్రాక్టులు అప్పగించడమేమిటని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ సాధించుకున్నదిందుకేనా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు టీడీపీ తెలంగాణ నేతలు గానీ, అధికార టీఆర్ఎస్ నేతలు గానీ నేరుగా స్పందించనే లేదు. ఏపీ టీడీపీ మంత్రుల్లో యనమల రామక్రుష్ణుడు మాత్రమే ప్రతిస్పందించారు. తనకు కాంట్రాక్టులు ఇస్తే వాటిని రేవంత్ రెడ్డికి అప్పగిస్తామని సెలవిచ్చారు. అదీ టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేశాక యనమల ప్రతిస్పందించడం గమనార్హం.
శ్రీశైలంలో క్రుష్ణా జలాల తరలింపుపై సాక్షిలో ఇలా కథనాలు
ఇంతకుముందు వైఎస్ జగన్మోహన రెడ్డిపై ఒంటికాలిపై లేచి నిలిచే ఏపీ మంత్రులు.. అందునా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతిస్పందించే టీడీపీ ఏపీ నేతలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో అనుబంధంపై నోరు మెదపకపోవడమే సందేహాలకు తావిస్తున్నది. ఇటీవల క్రుష్ణా నదీ జలాలను శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా తరలిస్తున్నదని ‘సాక్షి' తెలంగాణ ఎడిషన్లో వార్త ప్రచురించింది. కానీ దీనిపై ఏపీ మంత్రులు, సాక్షాత్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ క్రుష్ణమూర్తి నానా యాగీ చేశారు. ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వంపై కుమ్మక్కయ్యారని ఎదురుదాడికి దిగారు. ఇటీవల క్రుష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన నీరు దొడ్డి దారిలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్కు తరలించిన నేపథ్యం ఏపీ సర్కార్ది.
భావి పరిణామాలకు మోత్కుపల్లి ప్రకటన నిదర్శనం ఇలా
కానీ రాజకీయంగా తమ లోపాలను ఎత్తిచూపుతూ విధానాలను వైఎస్ జగన్ ప్రతిఘటించడం ఏపీ మంత్రులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. మళ్లీ ఏపీలో గెలుపు ప్లస్ తెలంగాణలో పార్టీ మనుగడ కొనసాగించడం కోసం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు టీడీపీ నేత మోత్కుపల్లి చేసిన ప్రకటన భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా నిలిచింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని సందర్బోచితంగా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు సాగించింది. రెండు రాష్ట్రాల మధ్య సంప్రదాయంగా క్రుష్ణా నదీ జలాల పంపిణీ జరుగుతూనే ఉన్నది. కానీ ఏపీ సర్కార్.. తొలి నుంచి అనుసరించిన దూకుడే ఇప్పుడు సాగించాలని తపన పడుతున్నది. తాగునీరు సాకుతో తమ సాగునీటి అవసరాలకు తరలించుకుపోతూనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా మానవతా ద్రుక్పథంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తూనే ఉన్నది.
భవిష్యత్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బగా నిలిచే చాన్స్
ఇప్పటికిప్పుడు టీడీపీలో పరిణామాలు.. ఏపీలో అధికార పక్షం, తెలంగాణలో ప్రభుత్వం - టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి గానీ, ఆయన పార్టీ గానీ బహిరంగంగా ప్రతిస్పందించలేదు. కానీ మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం అతిపెద్ద ప్రచారాస్త్రం కానున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమేకమై ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆరోపిస్తున్న టీడీపీకి భవిష్యత్లో గట్టి ఎదురు దెబ్బగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కేసీఆర్, చంద్రబాబు ఇలా భావోద్వేగ వాదం
నాడు తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ‘సమైక్య‘ సీమాంధ్ర నేతలు ఏపీని విభజించొద్దని వాదించారు. తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో తమను బయటకు పంపేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రులందరిని సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చగొట్టి భావోద్వేగం రగిల్చేందుకు వెనుకాడలేదు. చంద్రబాబుది ‘రెండు కళ్ల సిద్ధాంతం' అని పదేపదే టీఆర్ఎస్ కూడా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగానూ టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వాసులకు ఏ సంకేతం ఇవ్వబోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారనున్నది.