జగన్ 'బుక్'కు 'లేఖ' లింక్: మైసూరా టిడిపి కోవర్టుగా మారారా?
విజయవాడ: ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతుంటే, మరోవైపు ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇక్కడ వైసిపిని చంద్రబాబు బలహీనపర్చేందుకు పావులు కదుపుతుంటే, ఢిల్లీలో జగన్ ఫిర్యాదులు చేస్తున్నారు.
ఓ వైపు ఫిర్యాదులు, మరోవైపు చేరికలు, ఇంకోవైపు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీలో వేడి రాజుకుంది. ముఖ్యంగా, చంద్రబాబు పైన జగన్ రూ.లక్షా 30వేల కోట్ల ఆరోపణలు చేయడం, బాబు పైన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం తేవడం, మైసూరా రెడ్డి వైసిపికి రాజీనామా చేస్తూ ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
జగన్ ఆరోపణలు, మైసూరా రెడ్డి వ్యాఖ్యలు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కౌంటర్... చర్చకు దారీ తీస్తున్నాయి. ఇందులో, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.
బాబుపై జగన్ ఆరోపణలు
జగన్ తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో రూ.1లక్షా ముప్పై వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆధారాలతో సహా ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం తెచ్చినట్లు చెప్పారు. అంతేకాదు, కోట్లాది రూపాయలు ఇచ్చి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు.
ఢిల్లీ స్థాయిలో ఆయన చంద్రబాబు పైన వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ తదితరులకు జగన్ ఫిర్యాదు చేశారు. అయితే, జగన్ పైన లక్ష కోట్ల అవినీతి నేపథ్యంలోనే చంద్రబాబు పైన ఉద్దేశ్యపూర్వకంగా రూ.లక్షా ముప్పైవేల కోట్ల ఆరోపణలు చేస్తున్నారంటున్నారు.
మైసూరా ఇష్యూ...
సీనియర్ నేత మైసూరా రెడ్డి బుధవారం వైసిపిని వీడారు. ఇదే రోజు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ తదితరులు టిడిపిలో చేరారు. మైసూరా పార్టీని వీడుతూ జగన్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సీనియర్లకు విలువ ఇవ్వరని, ఒంటెత్తు పోకడలకు వెళ్తారని అభిప్రాయపడ్డారు.
దీనిపై జగన్ ఘాటుగా స్పందించారు. అసలు మైసూరా రెడ్డి ఆరు నెలల క్రితం తనకు కనిపించారని, అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని చెప్పారు. అదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విధంగా మైసూరా రెడ్డిని కోవర్టు అని అభిప్రాయపడ్డారు.
మైసూరా రెడ్డి ఆరు నెలలుగా టిడిపి కోసం పని చేస్తున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి టిడిపిలో చేరాలని చెబుతున్నారని ఆరోపించారు. తద్వారా ఇన్నాళ్లుగా ఆయన టిడిపికి కోవర్టుగా పని చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు అవినీతి పైన జగన్ పుస్తకం విడుదల చేయగానే, కౌంటర్గా మైసూరాతో ఉద్దేశ్యపూర్వకంగా టిడిపి లేఖ రాయించిందని అభిప్రాయపడ్డారు. జగన్ పుస్తకాన్ని కౌంటర్ చేసేందుకు టిడిపి మైసూరా లేఖ ద్వారా ప్రయత్నం చేసిందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. డబ్బు కోసం, తన మైనింగ్ కంపెనీల కోసమే మైసూరా ఆరు నెలలుగా టిడిపి కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.