కొత్త జిల్లాల తేనెతుట్టె? వైఎస్ జగన్కు లాభమా? నష్టమా?
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు ఆరంభమౌతోంది. ఇప్పుడున్న 13 జిల్లాల సంఖ్యను 25కు పెంచాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచన. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఆయన ఇదివరకు ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. అధికారంలోకి రాగానే- దానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం- పాలనాపరంగా ఎలాంటి మార్పులకు దారి తీస్తుందనే విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయంగా, సామాజికంగా వైఎస్ జగన్కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
ఒక్కో లోక్సభ ఒక్కో జిల్లా..
రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలు కడప, చిత్తూరులను తీసుకుంటే- ఈ రెండు జిల్లాలు నాలుగవుతాయి. కడప జిల్లాలో కడప, రాజంపేట, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతిగా జిల్లాలు ఆవిర్భవిస్తాయి. రాజంపేట లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటిల్లో మూడే కడప జిల్లాలో ఉన్నాయి. మిగిలినవి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, ప్రస్తత కడప జిల్లాలో, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలు చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. రాజంపేట లోక్సభ స్థానాన్ని జిల్లాగా ప్రకటిస్తే, ఈ ఏడు స్థానాలు కూడా మాతృజిల్లాల నుంచి విడిపడిపోతాయి. రాజంపేట జిల్లా కిందికి వస్తాయి. ఇక్కడే కొత్త చిక్కులు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రాజంపేటకు బదులుగా మదనపల్లి..
రాజంపేటకు బదులుగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ అప్పుడే మొదలైంది కూడా. జిల్లాల విభజన చోటు చేసుకుంటే పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాలు కడప జిల్లాలోని రాజంపేట కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాకు చేరుతాయి. రోజువారీ అవసరాల కోసం సాధారణ ప్రజలు గానీ, విద్యార్థులు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే.. మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు వంటి నియోజకవర్గాల వారికి ఇబ్బందికరమేననే వాదన తలెత్తింది కూడా. పాలనాపరమైన సౌలభ్యం విషయంలో కూడా అక్కడి ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వుంటుందని అంటున్నారు.
మనోభావాలను దెబ్బతీస్తున్నారా?
తమ సొంత జిల్లా చిత్తూరుతో అనుబంధాన్ని తెంచుకోవాల్సి రావడం ప్రజలు మనోభావాలకు సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నారు. మదనపల్లితో పోల్చితే రాజంపేట చిన్న పట్టణం. మదనపల్లెకు డివిజన్ కేంద్రంగా శతాబ్దాల చరిత్ర ఉందని, ప్రభుత్వ పాలనకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో వున్నాయని, చెప్పుకోదగిన వైద్య, విద్యాసంస్థలు ఉన్నందున రాజంపేటకు బదులుగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ తలెత్తింది. దీనికోసం అందరం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్రంకొండకు చెందిన ఈశ్వరయ్య అనే సామాజిక కార్యకర్త చెబుతున్నారు. జిల్లాలను పరిరక్షించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
నెల్లూరు జిల్లా రూపురేఖలు మారిపోతాయి..
కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం నెల్లూరు జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చేస్తుంది. పేరుకే పెద్ద జిల్లా అయినప్పటికీ- ప్రస్తుతం ఈ జిల్లాలో ఒకే ఒక్క లోక్సభ ఉంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి స్థానాలు తిరుపతి లోక్సభ పరిధిలోకి వస్తాయి. తిరుపతిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే.. అవన్నీ నెల్లూరు నుంచి విడిపోతాయి. ప్రస్తుతం నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్న కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి స్థానాలు నెల్లూరు జిల్లా కిందికి వస్తాయి. కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి విడివడుతుంది.
తిరుపతి.. కొత్త తలనొప్పి!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని తమ జిల్లా నుంచి వేరు చేస్తున్నారనే అభిప్రాయం చిత్తూరు జిల్లావాసుల్లో వ్యక్తం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కలియుగ దైవం శ్రీనివాసుడు తమ జిల్లాలో కొలువయ్యారని గర్వంగా చెప్పుకొనే చిత్తూరు జిల్లా ప్రజలు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ అవకాశాన్ని కోల్పోవచ్చనే ఉండకపోవచ్చు. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులతో తిరుపతి జిల్లా ఏర్పాటవుతుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మినహా మిగిలివన్నీ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి.
రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రం..
కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం రాజకీయంగా కూడా వైఎస్ జగన్కు కొత్త తలనొప్పులను తీసుకుని రావచ్చు. తిరుగులేని మెజారిటీని సాధించిన ఆయన.. తన ప్రత్యర్థులకు అయాచిత అస్త్రాన్ని అందించినట్టవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. పాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వంటి సున్నిత సమస్యను భుజానికి ఎత్తుకోవడం తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని అంటున్నారు.
తెలంగాణలో ముళ్లకిరీటం
10 జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణలో ఎలాంటి వివాదాలను రేకెత్తించిందో తెలిసిన విషయమే. 10 జిల్లాలతో ఆవిర్భవించిన తెలంగాణ ప్రస్తుతం 33 జిల్లాలతో కొనసాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను నీరుగార్చాలనే ఉద్దేశంతో జిల్లాల విభజన చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా- తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ నేతృత్వంలో ఏర్పాటైన ఐక్య కార్యాచరణ సమితిని బలహీనపర్చారని అపవాదు లేకపోలేదు. అదే పరిస్థితిని మనరాష్ట్రంలో వైఎస్ జగన్కు ఎదురు కావడం తథ్యమని అంటున్నారు.