పవన్ కల్యాణ్కు అపాయింట్మెంట్ దొరకలేదా..? ఢిల్లీలో అసలేం చేస్తున్నట్టు?
మంగళగిరిలో శనివారం జనసేన విస్తృత స్థాయి సమావేశం నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమరావతిపై మాట్లాడేందుకే కేంద్రంలోని బీజేపీ పెద్దలే ఆయన్ను పిలిచారా.. లేక ఆయనే అపాయింట్మెంట్ తీసుకున్నారా..? అన్న దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకుని ఉంటే.. పార్టీ సమావేశాన్ని వాయిదా వేసుకునేవారు కదా అన్న చర్చ జరుగుతోంది.
ఇక ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి పవన్ కల్యాణ్కు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రులు జేపీ నడ్డాతో శనివారం సాయంత్రం ఆయన భేటీ అవుతారని వార్తలు వచ్చినప్పటికీ.. అదేమీ జరగలేదు. దీంతో కేంద్రమంత్రులతో భేటీకి పవన్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం ఆయన జేపీ నడ్డాతో భేటీ అవబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీంతో పవన్కు అపాయింట్మెంట్ దొరకలేదా..? లేక మీడియాకు తెలియకుండా సీక్రెట్గా భేటీ అవుతున్నారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఇటీవల రాష్ట్ర బీజేపీ తీర్మానం చేయడం, అమరావతి విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఇటీవల పవన్ కల్యాణ్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన,బీజేపీ కలిసి అమరావతిపై పోరాటానికి సిద్దమవుతున్నాయా అన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై చర్చించడానికే పవన్ కల్యాణ్ను ఢిల్లీ పిలిచి ఉంటారేమోనన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు పవన్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ రంగంలోకి దిగుతాడని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి విమర్శించారు. ఆయన విమర్శలను నిరసిస్తూ కాకినాడలో జనసేన కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లతో దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు.మొత్తం మీద పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనన్న ఆసక్తి నెలకొంది.