కేంద్రంతో పవన్ ఇక అమీతుమీ ? బీజేపీకి టాటాకు ముహుర్తం ! నాదెండ్ల ప్రకటనతో చర్చ
ఏపీలో రెండేళ్ల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆ పార్టీకి బ్రేక్ అప్ చెప్పేయబోతున్నారా ? ఇప్పటికే బీజేపీ పోరాటాలకు దూరంగా ఉంటున్న జనసేనాని.. త్వరలో కాషాయ పార్టీ తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించబోతున్నారు. అంటే కాషాయంపై పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న మాట. దీంతో బీజేపీతో బ్రేకప్ కు ఇదే ముహుర్తం కాబోతుందన్న ప్రచారం మొదలైంది. దీనంతటికీ కారణం పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన ఓ ప్రకటనే.
బీజేపీతో పవన్ ప్రయాణం
ఏపీలో బీజేపీతో రెండేళ్ల క్రితం పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మొదట్లో ఉమ్మడిగా పోరాటాలు చేసే వారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ తరఫున ప్రభుత్వంవై పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో బీజేపీని కలిసి రావాలని బహిరంగంగా ఎప్పుడూ కోరింది లేదు. ఈ లోగా పార్టీలో అంతర్గతంగా నేతల నుంచి బీజేపీకి టాటా చెప్పేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. జనసేనకు దూరమవుతున్న మైనార్టీ ఓటు బ్యాంకుతో పాటు ఇతర కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో జనసేనపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంది. అదే సమయంలో రాయలసీమ జిల్లాలపై బీజేపీ ఫోకస్ కూడా పెరిగింది. దీంతో బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు జనసేనకు పరిస్ధితులు అనుకూలించం లేదు.
బీజేపీ వివాదాస్పద అజెండాతో చికాకు
ఈ మధ్య కాలంలో బీజేపీ వివాదాస్పద అంశాల్ని వరుసగా తెరపైకి తెస్తూ మైనార్టీలను, వారి మద్దతు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ పోరాటంలో జనసేనాని పవన్ తో పాటు జనసేన నేతలు కూడా మద్దతివ్వాలని కోరుకుంటోంది. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, టిప్పుసుల్తాన్ విగ్రహం వంటి అంశాల్లో బీజేపీ అజెండాకు అనుగుణంగా జనసేన అధినేత అడుగులు వేయలేని పరిస్ధితి. అయినా విగ్రహాల ధ్వంసంపై పవన్ పలుమార్లు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతూ బీజేపీ అజెండాకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్తా ఆయనకు బూమరాంగ్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో కడప జిల్లా ప్రొద్దుటూరు టిప్పుసుల్తాన్ విగ్రహం వివాదంలో మాత్రం జనసేన దూరంగా ఉండిపోయింది. బీజేపీ మాత్రం యథావిధిగా తమ పోరు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారాలు సహజంగానే జనసేనను చికాకు పెడుతున్నాయి.
బీజేపీకి టాటా కోసం ఎదురుచూపులు ?
తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీని వదిలించుకునేందుకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తగిన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. సరైన కారణం లేకుండా బీజేపీకి గుడ్ బై చెబితే ఆ ప్రభావం తమ పార్టీపై తప్పకుండా పడుతుందనే ఆందోళనలో ఆ పార్టీ ఉంది. మరోవైపు తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దీని ప్రభావం ఫలితాలపై పడింది. అదే ఉమ్మడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కీలక పోరాటాల్లో బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో జనసేన నేతల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది.
కలిసొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరు
ఇలాంటి సమయంలో జనసేన పార్టీకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరు కలిసొస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఆ పార్టీకి విశాఖతో పాటు ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అధే సమయంలో బీజేపీపై ఇతర పార్టీలు పోరాటాలు ముమ్మరం చేస్తున్నాయి. కానీ మిత్రపక్షంగా జనసేన మాత్రం ఏమీ మాట్లడలేని పరిస్ధితుల్లో ఉంది. ఇదే అదనుగా విశాఖ స్టీల్ పై పోరాటం చేయాలని జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విశాఖ స్టీల్ పోరాటంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్
ప్రకటన చేశారు. దీంతో పవన్ రంగంలోకి దిగడం ఖాయమైపోయింది.
స్టీల్ ప్లాంట్ పోరులోకి పవన్
కొన్నాళ్లుగా బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉంటూ వస్తున్న జనసేన నేతలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం కలిసొస్తోంది. దీంతో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించబోతున్నారు. ఇప్పటివరకూ అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా,... జనసేన మాత్రం దూరంగా ఉండిపోయింది. కానీ స్ధానికంగా ఉన్న కార్మిక సంఘాలతో పాటు కాపు నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ఇక రంగంలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ నేరుగా రంగంలోకి దిగితే ఆ ప్రభావం కచ్చితంగా బీజేపీ నిర్ణయాలపై ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతోంది.
Recommended Video
బీజేపీతో జనసేన బ్రేకప్ కు ముహుర్తం అదే ?
బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఎదురుచూస్తున్న జనసేన ఇందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరును ముహుర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో విశాఖ వేదికగా ఇసుక పోరాటం చేసిన జనసేన.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పోరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో తాము బ్రేకప్ అవుతున్నట్లు పవన్ ప్రకటించే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో సరైన కారణంతో బీజేపీకి బ్రేకప్ చెప్పడం ద్వారా ప్రజల్లో తమ చిత్తశుద్దిని నిరూపించుకునే అవకాశం కూడా దక్కుతుందని జనసేన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.