ఒక్క డైలాగ్ వంద ప్రశ్నలు!: వారికి పవన్ కళ్యాణ్ వార్నింగా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు ఇచ్చారా? అనే చర్చ సాగుతోంది. పదే పదే తన పైన విమర్శలు చేసే వారికి ఈ చిత్రంలో సమాధానం కూడా ఇచ్చారని అంటున్నారు. అలాగే జనసేన వేడి తగ్గకుండా చూసే ప్రయత్నాలని అంటున్నారు.
గోపాల గోపాల చిత్రంలోని ఓ డైలాగ్ హాట్ టాపిక్గా మారింది. 'కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా' అనే డైలాగ్ ఉంది. డైలాగ్ చెప్పిన తీరు, వాలకం చూస్తే తన రాజకీయ ప్రస్థానం గురించే అయి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ స్థాపించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి కూటమికి ప్రచారం చేసిన పవన్.. ఎన్నికల అనంతరం రాజకీయాల్లో కీలకంగా కనిపించడం లేదు. దీంతో ఆయన పైన విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కొందరు నేతలు ఆయన రాక పైన ప్రశ్నలు, సెటైర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే, పలుమార్లు పవన్ రాక పైన ప్రశ్నించింది. ఏదో చేస్తానని జనసేనను స్థాపించి చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ ఇప్పుడేం చేస్తున్నారని ఘాటుగా ప్రశ్నించింది. వీటిపై జనసేన అప్పుడే స్పందించింది. ఈసీ నుండి గుర్తింపు వచ్చాక పవన్ కార్యాచరణ ఉంటుందని వివరణ ఇచ్చింది.
ఇటీవలే ఈసీ నుండి గుర్తింపు వచ్చింది, అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంకా మౌనంగా ఉంటున్న నేపథ్యంలో... తనను ప్రశ్నించే వారికి పవన్ ఆ డైలాగ్తో సమాధానం చెప్పినట్లుగా భావిస్తున్నారు. తన విరామాన్ని ప్రశ్నించే వారికే ఆ డైలాగ్ తగులుతుందని అంటున్నారు.
మరికొందరైతే పీఆర్పీని స్థాపించిన చిరంజీవి, ఆ తర్వాత అవకాశవాద రాజకీయాలు చేశారని, ఇప్పుడు తమ్ముడు కూడా అదే దారిలో నడుస్తున్నారని ఆరోపిస్తున్నారట. వీటన్నింటికి సమాధానంగానే ఆ డైలాగ్ అంటున్నారు. ఈ డైలాగ్ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. గతంలో హీరో నందమూరి బాలకృష్ణ తదితరులు చేసిన సినిమాల్లోని డైలాగుల పైన రాజకీయ పరమైన చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి.