వైయస్ ఆత్మ క్యాప్స్టన్ కథ క్లోజ్ ? జగన్ కనికరిస్తారా..?
అమరావతి: వచ్చేనెల నిర్వహించబోయే రాజ్యసభ ఎన్నికలు కొమ్ములు తిరిగిన ఇద్దరు రాజకీయ నాయకుల కేరీర్కు ముగింపు పలకబోతున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న ఆ ఇద్దరు నాయకుల పదవీ కాలం ముగియబోతోంది ఏప్రిల్ 9వ తేదీనాటితో. ఇక వారు మాజీగా మిగలడానికే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు. ఆ ఇద్దరూ- కేవీపీ రామచంద్ర రావు, టీ సుబ్బరామి రెడ్డి.
చిరంజీవికి అమరావతి సెగ: ఇంటి వద్ద నిరాహార దీక్షకు జేఏసీ ప్లాన్
వైఎస్సాఆర్ అంతరాత్మగా..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్ర రావు ఎంత ఆత్మీయుడో, ఆప్తుడో.. ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని అంశం. కేవీపీని తన ఆత్మగా వైఎస్ బహిరంగంగా చెప్పుకొనే వారు. కేవీపీకి చెబితే.. తనకు చెప్పినట్టేననే విషయాన్ని ఆయన బహిరంగంగా స్పష్టం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవీపీ తన వెంట లేకుండా ఎలాంటి కీలక నిర్ణయాన్నీ వైఎస్ తీసుకునే వారు కాదని, ఎలాంటి విషయంపైనయినా ఆయనతో చర్చించిన తరువాతే అడుగు వేసేవారనే పేరుంది.
వైఎస్ హఠాన్మరణం తరువాత కాంగ్రెస్లోనే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. సొంతంగా పార్టీ పెట్టారు. తండ్రిని పోగొట్టుకున్న స్థితిలో ఉన్న వైఎస్ జగన్కు కేవీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉంటారని, రాజకీయాల్లో దిశా నిర్దేశం చేస్తారని అందరూ భావించారు. అందరి అంచనాలకూ అందని విధంగా కేవీపీ కాంగ్రెస్లోనే ఉండిపోయారు. వైసీపీ వైపు వెళ్లాలనే కనీస ఆలోచన కూడా చేయలేదు. పైగా వైఎస్ జగన్ను విమర్శించారు.
రాజ్యసభ సభ్యత్వం ముగింపుతో..
ఏప్రిల్ 9వ తేదీన కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభ సభ్యత్వం ముగియబోతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాన కోటా కిందికి వెళ్లారు. ఆయనను మళ్లీ నామినేట్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి సున్నా స్థాయికి దిగజారింది. ఇప్పట్లో కోలుకునేలా లేదనే అనుకోవచ్చు. పేరున్న నాయకులెవరూ పెద్దగా ఆ పార్టీలో లేరు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కొద్దో, గొప్పో బలం ఉంది హస్తం పార్టీకి. పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడానికి ఆ బలం సరిపోదు. ఉందనే అనుకున్నా.. కేవీపీకి ఆ అవకాశం ఎంతమాత్రమూ దక్కదు. వైసీపీకి బలం ఉన్నప్పటికీ.. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఆలోచన కూడా లేదు.
టీఎస్సార్ పరిస్థితీ అంతే..
కేవీపీకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది టీ సుబ్బరామిరెడ్డి పరిస్థితి. కారణం- కాంగ్రెస్సే. కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన టీఎస్సార్.. మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశాలు లేవు. పారిశ్రామికవేత్తగా ఆయనకు ఆ రంగానికి చెందిన పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. కళాబంధుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఆయనను రాజ్యసభకు మరోసారి నామినేట్ చేయడానికి ఉపయోగపడకపోవచ్చు.
Recommended Video
ఇక మాజీలుగానే..
ఈ పరిస్థితుల్లో ఇక వారిద్దరూ మాజీలుగా మిగలడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టీ సుబ్బరామిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో కూడా లేరు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో అలా మెరుస్తుంటారంతే. కేవీపీ రామచంద్ర రావు క్రియాశీలకంగానే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే దిశగా పార్టీ నాయకులు చేస్తోన్న కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు.