రివర్స్ టెండరింగ్ రియాల్టీ షోనా ? దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో టిడిపి నేతలు పలు విమర్శలను చేస్తున్నారు. పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒకే కాంట్రాక్టర్ కు దక్కాయని వెలిగొండ పనుల టెండరింగ్ లో రియాలిటీ షో జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అంటూ ..పార్టీ మార్పుపై దేవినేని అవినాష్ క్లారిటీ ..
ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన రివర్స్ టెండరింగ్ ను రియాల్టీ షో అని దేవినేని ఉమ విమర్శిస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుపై అది చేసాం ఇది చేశాం అంటూ గ్రాఫిక్స్ చూపించుకున్నారే తప్ప ఏ ఒక్కపనీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన దేవినేని వేల కోట్ల రూపాయలను దోచుకుని తిన్నారని ఆరోపణలు గుప్పించారు. దేవినేని ఉమా కొవ్వు పట్టిన మాటలు ఈరోజు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఒక నెలలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం ఆదా చేసిన మాటను దేవినేని ఉమమర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు.
ఇక అంతే కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రోజు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ కేసును మాఫీ చేయించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాడని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జగన్ అందుకోసం ఢిల్లీకి వెళితే, మరి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లింది జగన్ పై కేసులు బనాయించటానికి కోరడానికి కదా అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తూ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.