పద్మలతను నాగుపాము విషంతో చంపారా? ఏం జరిగింది?
ఎస్.రాయవరం మండల పరిషత్తు మాజీ అధ్యక్షురాలు కాకర పద్మలత హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆమెను అంతమొందించడానికి ఏ విషాన్ని ప్రయోగించారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నం: ఎస్.రాయవరం మండల పరిషత్తు మాజీ అధ్యక్షురాలు కాకర పద్మలత హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆమెను అంతమొందించడానికి ఏ విషాన్ని ప్రయోగించారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.
'పద్మలత' వల్లే రాజును డీఎస్పీ హత్య చేయించాడు: 'బ్యాంకాక్లోనే స్కెచ్!'
పద్మలత విషయంలో అలా జరగలేదు..
సాధారణంగా ఎవరిమీదనైనా విష ప్రయోగం జరిగి.. మరణించినట్లయితే ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహంలోని భాగాలను ఫోరెన్సిక్ పరిశోధనశాలకు పంపిస్తుంటారు. దీంతో వారు మరణానికి కారణాలేమిటి? ఏ విషయం ఉపయోగించారో నిగ్గు తేలుస్తారు. పద్మలత విషయంలో అసలేం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. ఆమెను విషప్రయోగం చేసి చంపారన్న విషయం నిర్ధరణ అయింది. ఏ విషం ఇచ్చారు? అది నిందితులకు ఎలా వచ్చింది? ఎవరు సమకూర్చారు? తదితర అంశాలపై పోలీసులకు ఎలాంటి సమాచారమూ లేదు. పద్మలతపై మొదటిసారి హత్యాప్రయత్నం గత సంవత్సరం ఆగస్టు 29న జరిగింది. అప్పట్లో విషాహారం తిని స్పృహ తప్పి పడిపోవడంతో కేజీహెచ్లో చేర్పించి వైద్యం చేయించారు.
అనారోగ్యంగా నమ్మించారు..
అయితే, అప్పటి ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. దీంతో ఆమె తిన్న ఆహారంలో ఏం కలిపారన్నది వెలుగు చూడలేదు. వైద్యులు సైతం.. ఆమెను రక్షించడంపైనే దృష్టి పెట్టి.. ఎలాంటి పదార్థాల వల్ల ఆమె అనారోగ్యం పాలైందన్నదానిని పట్టించుకున్నట్టు లేదు. రెండోసారి ఆమె విష ప్రయోగం వల్లనే మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో అసలేం జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2016, ఆగస్టులో కేజీహెచ్లో పద్మలత చికిత్సకు సంబంధించిన కేస్షీట్లను పరిశీలించనున్నారు.
నాగు విషమే కలిపారా?
పద్మలతకు ఇచ్చిన ఆహారంలో నాగుపాము విషం కలిపారన్న సమాచారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన ప్రతీ సమాచారాన్ని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా పాము విషం కోణంలోనూ విచారణ చేస్తున్నారు. 2016, ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 1 వరకు కేజీహెచ్లో చికిత్స పొందిన పద్మలత అనంతరం గేదెల రాజు ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో కూడా స్లోపాయిజన్ ఇచ్చినట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఆ స్లో పాయిజన్ ఏమిటన్నది కేసులో కీలకంగా మారనుంది.
స్లో పాయిజన్ ఎక్కించారు..
ఆ స్లో పాయిజన్ కారణంగానే పద్మలత ఆరోగ్యం దెబ్బతిని మంచాన పడిందని, చివరగా 2016, సెప్టెంబరు 22న మరోసారి జరిగిన విష ప్రయోగం కారణంగా ఆమె మరణించిందని విచారణలో బయటపడింది. అన్నిసార్లూ ఆమెకు నాగుపాము విషాన్నే వినియోగించారా? మరేదైనా విష వినియోగించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అప్పటి డీఎస్పీ రవిబాబే.. గేదెలా రాజు సాయంతో పద్మలతను హత్య చేయించిన విషయం తెలిసిందే.