పారిపోతున్న టీడీపీ అభ్యర్థులు? నిన్న ఆదాల.. నేడు బుడ్డా?
Recommended Video
కర్నూలు: అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు విధ్వంసానికి పాల్పడుతుండగా.. దీనికి భిన్నమైన పరిస్థితి అధికార పార్టీలో నెలకొంది. అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత కూడా నాయకులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ప్రచారాన్ని మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదంతం తరువాత.. అలాంటి ఘటనలే మరి కొన్ని తెర మీదికి వస్తున్నాయి.
తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఆయన స్థానిక నాయకులకు అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం. దీనితో తెలుగుదేశం పార్టీ.. హుటాహుటిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని రంగంలోకి దించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
ఫిరాయింపు ఎమ్మెల్యేగా గుర్తింపు
బుడ్డా రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. అనంతరం పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదట సరేనన్న బుడ్డా.. అనంతరం తన వైఖరిని మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారాంలో అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత ఎదురవుతుండటమే దీనికి కారణమని తెలుస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన శిల్పా చక్రపాణి రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని బుడ్డా రాజశేఖర్ రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేలో తేలినట్లుగా సమాచారం. దీనితో ఆయన ప్రచార కార్యక్రమాలకు అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన రోజే బుడ్డా అందుబాటులో లేకపోవడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది.
ఆదాల ఉదంతంతో ఉలిక్కిపడుతున్న టీడీపీ..
నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నెల్లూరు లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు ఆదాల. మూడు రోజుల కిందట.. రాత్రికి రాత్రి పార్టీని వీడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగేలా చేసింది. పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాత కూడా పార్టీ ఫిరాయించారనే విషయం టీడీపీకి మింగుడు పడట్లేదు. వృత్తిపరంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టు పనులను దక్కించుకున్నారు. దీనికి సంబంధించిన 43 కోట్ల రూపాయల విలువ చేసే బిల్లులను ప్రభుత్వం తొక్కి పెట్టింది. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీనితో గత్యంతరం లేక... ఆయన ఇన్నాళ్లుగా టీడీపీలో కొనసాగారు.
ఎన్నికల ప్రచారానికి డబ్బు అవసరం కావడంతో.. చంద్రబాబు ప్రభుత్వం ఆ బిల్లులను విడుదల చేసింది. 43 కోట్ల రూపాయలు ఆదాల బ్యాంకు ఖాతాలో పడగానే.. ఆయన చంద్రబాబు కబంధ హస్తాల నుంచి విముక్తి పొందినట్టు భావించారు. రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించారు. అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి, వైఎస్ జగన్ ను కలిశారు. ఆయన పార్టీలో చేరారు. ప్రస్తుతం నెల్లూరు లోక్ సభ స్థానం నుంచే ఆయన వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఓటమి ఖాయమని తెలిసే..?
ప్రస్తుతం బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాల తరహాలోనే పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. ఓటమి ఖాయమని నిర్ధారణకు రావడం వల్లే బుడ్డా.. పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ సీపీ నుంచి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు లేవు. అయినప్పటికీ.. ఎమ్మెల్సీ ఇచ్చినా సరే.. తాను వైఎస్ఆర్ సీపీలోకి వస్తానని ఆయన సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది.
శ్రీశైలం బరిలో ఏరాసు?
ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ అగ్ర నాయకత్వం.. మాజీమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని బరిలో దించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి 2009 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయనకు ఈ స్థానంపై గట్టి పట్టు ఉంది. బుడ్డా గనక తప్పుకొంటే ఏరాసుకు టికెట్ ఖాయమని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఏరాసు టీడీపీ అభ్యర్థిగా పాణ్యం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు పాణ్యం టికెట్ దక్కలేదు. ఈ స్థానం నుంచి తాజాగా పార్టీ ఫిరాయించిన గౌరు చరితకు దక్కింది. దీనితో ప్రస్తుతం ఆయన టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.