చంద్రబాబుపై ఆగ్రహం: 'స్వరూపానంద సరస్వతి.. జగన్ కోవర్టా?'
విజయవాడ: విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.
టిడిపి బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్ శ్రీధర్ సోమవారం స్వరూపానందేంద్ర సరస్వతి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పోరేషన్ పైన ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రతిపక్ష జగన్ కోవర్టుగా స్వరూపానందేంద్ర మాట్లాడుతున్నారన్నారు. కాపు కులంలో చిచ్చు పెట్టేందుకు జగన్ విఫలయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ మాయలో బ్రాహ్మణులు పడవద్దన్నారు.
బ్రాహ్మణ నిధులను టీడీపీ నేతలే 'స్వాహా' చేస్తున్నారు : విశాఖ పీఠాధిపతి
స్వరూపానందేంద్ర మాట్లాడుతూ... టిడిపి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, ఎన్నికలకు ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం తన చుట్టూ ప్రదక్షిణలు చేసిన పార్టీ ఇప్పుడు బ్రాహ్మణుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఆ తర్వాత దానిని మరిచారన్నారు. ఇప్పుడు కూడా నామమాత్రపు నిధులతో ఏర్పాటు చేశారన్నారు.
స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా ఉన్నాయనే వాదనలు చాలా రోజులుగా ఉన్నాయి. గతంలోను ఆయన చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ముహూర్త బలం లేదని చెప్పానని, అందుకే ఆయన ఇబ్బందులు పడుతున్నారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందఅన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో దేవాదాయ శాఖ, టీటీడీలు విఫలమయ్యాయని చెప్పారు.