తమ్మినేని సీతారాం ను స్పీకర్ గా తప్పించి మంత్రిగా అవకాశం ? ఆయన దూకుడు ప్లస్ అవుతుందా ?
తమ్మినేని సీతారాం... ఏపీ స్పీకర్ గా రాజ్యాంగబద్ధ పదవిలోఉన్న వ్యక్తి. ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ తరఫున కీలక భూమిక పోషించే తమ్మినేని దూకుడు ఆయనకు కలిసొస్తుందా? మంత్రి కావాలనుకుని, ప్రస్తుతం స్పీకర్ గా కొనసాగుతున్న ఆయనను స్పీకర్ పదవి నుండి తప్పించి మంత్రిగా సీఎం జగన్ అవకాశం ఇస్తారా? స్పీకర్ గా కంటే మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మరింత దూకుడు చూపించే వీలు ఉంటుందని,అది పార్టీకి కలిసొస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారా? అనేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర చర్చ.
ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!
మంత్రి పదవి కోసం తమ్మినేని యత్నాలు
తమ్మినేని సీతారాం ఇప్పటివరకు ఏపీ స్పీకర్ గా అధ్యక్షా ! అనిపించుకుంటున్నారు. అయితే ఆయన అమాత్యా ! అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు అని సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతుండటంతో కొత్తగా మంత్రివర్గంలో అవకాశం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఉన్నారని సమాచారం.
తమ్మినేని దూకుడుకు మంత్రి పదవి కరెక్ట్ ? వైసీపీ లో చర్చ
తమ్మినేని సీతారాం సహజంగా దూకుడు ఉన్న వ్యక్తి. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి. స్పీకర్ హోదాలో ఉండి ఆయన దూకుడు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్మినేని స్పీకర్ పదవి నుండి తప్పించి మంత్రిగా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన సీఎం జగన్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది.అంతేకాకుండా ప్రతిదానికి బీసీ కార్డు వాడుతున్న టిడిపికి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి తమ్మినేని బాగా ఉపయోగపడతాయని వైసిపి వర్గాలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
స్పీకర్ పదవి తమ్మినేని దూకుడుకు ప్రతిబంధకమా !!
తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి ఇస్తే, క్యాబినెట్లోకి తీసుకుంటే టిడిపికి సమాధానం చెప్పగల ఫైర్ బ్రాండ్ మినిస్టర్ లభించినట్టేనని భావిస్తున్నవారు లేకపోలేదు. స్పీకర్ గా ఉన్న తమ్మినేనికి కొన్ని పరిమితులు ఉండడం వల్ల ఆయన దూకుడుకు అది ప్రతిబంధకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పదవి నుంచి ఆయనను తప్పించి ఆ స్థానంలో కోన రఘుపతి లాంటివారిని కూర్చోబెట్టి తమ్మినేని క్యాబినెట్ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వైసిపి అధిష్టానం చేస్తుందని సమాచారం. అంతేకాకుండా మూడు రాజధానులు విషయంలో అప్పట్లో ఉత్తరాంధ్ర తరఫున గట్టిగా మాట్లాడిన తమ్మినేని,అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారు.
సీఎం జగన్ ను కలిసి మంత్రి పదవి కోసం మంతనాలు
ప్రభుత్వానికి అనుకూలంగా అన్ని విషయాలలో గట్టిగా మాట్లాడగలిగిన వాడు కాబట్టి తమ్మినేని తనకు మంత్రి బెర్త్ ఖరారు చేయాలని సీఎం జగన్ ను కోరుతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో సీఎం జగన్ ని కలిసిన తమ్మినేనికి మంత్రి పదవి విషయంలో ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన ప్రముఖ దేవాలయాలను సందర్శించినట్లు తెలుస్తుంది. తిరుమల కూడా వెళ్లి మొక్క తీసుకున్నారట తమ్మినేని.
Recommended Video
అమాత్యా అనిపించుకోవటం కోసం తమ్మినేని లాబీయింగ్
అంతేకాదు ఇటీవల వైయస్సార్ జయంతి సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి విజయసాయిరెడ్డిని పిలవడం, మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్న నేపథ్యంలో అని ప్రచారం జరుగుతుంది . శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన తమ్మినేనికి మంత్రిగా అవకాశం ఇస్తే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ఒక బీసీ నేతకు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. అదే సమయంలో పార్టీ కోసం దూకుడుగా మాట్లాడే తమ్మినేనికి టిడిపి పై విరుచుకు పడటానికి వెసులుబాటు దొరుకుతుంది అనేది ఒక ఆలోచనగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఫైర్ బ్రాండ్ తమ్మినేని సీతారాం కూడా మంత్రి రేసులో ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.