నీళ్లు మింగిన చంద్రబాబు, మీ పార్టీ వెబ్సైట్లో పెట్టే దమ్ముందా?: టీడీపీకి రోజా
అమరావతి: నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిందేమీ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆదివారం విమర్శలు గుప్పించారు. ఏ విషయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు రుణమాఫీ ఎక్కడా జరగలేదన్నారు. 90 శాతం హామీలను నెరవేర్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
హామీలు నెరవేర్చినట్లయితే టీడీపీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీకి దమ్ముంటే మేనిఫెస్టోను మళ్లీ వెబ్ సైట్లో పెట్టాలన్నారు. ప్రాజెక్టులపై చంద్రబాబుకు ఆలోచన లేదని, రైతులపై ప్రేమ లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అఫ్పులను రూ.90వేల కోట్ల నుంచి రెండున్నర లక్షల కోట్లకు పెంచారన్నారు.
కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకున్నారని ఆరోపించారు. వాటర్ స్టోరేజీ లేకుండా ముంపు ప్రాంతం ఎలా పెరిగిందన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కీర వ్యాఖ్యలకు చంద్రబాబు నీళ్లు మింగారన్నారు. కరువు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అన్నారు.