పల్లె కూడా కదిలి వెళ్తారా? ఆయన మౌనం దేనికి సంకేతం?
అమరావతిః ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త చేరికలతో సమరోత్సాహానికి సన్నద్ధమౌతోంది. వైఎస్ఆర్ సీపీలోకి వలసల పర్వం ఊపందుకుంది. వైఎస్ఆర్ సీపీలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న చేరికలో ఒక ఎత్తు కాగా, తెలుగుదేశం పార్టీ మూలస్తంభాల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న దాసరి జైరమేష్ చేరిక మరో ఎత్తు. అంగబలం, అర్థబలమూ ఉన్న నాయకుడు ఆయన. తెలుగుదేశానికి ఉన్న ఆర్థిక మూలాల్లో కీలక వ్యక్తి కూడా. అలాంటి నాయకుడు వైఎస్ఆర్ సీపీలో చేరడం, ఆయనకు విజయవాడ లోక్ సభ స్థానాన్ని ఖరారు చేస్తారంటూ వార్తలు రావడం తెలుగుదేశానికి ఊహించని పరిణామమే. ప్రతిపక్ష పార్టీలో చేరుతున్న తమ నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు పట్టుతున్నప్పటికీ.. దాసరి జైరమేష్ విషయంలో ఆయన ఒక్కమాటా మాట్లాడలేదంటే ఆయనకు ఉన్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ఆర్సీపీలో చేరికను ఖండించని పల్లె..
తాజాగా మాజీ మంత్రి, విప్ పల్లె రఘునాథ రెడ్డి కూడా టీడీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు రెండురోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ- పల్లె రఘునాథ రెడ్డి వాటిని ఖండించలేదు. ఆయన మౌనంగా ఉంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఆయన మౌనం అర్ధాంగికారంగానే భావించవచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీలో సీనియర్ అయినప్పటికీ, జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేసినప్పటికీ పార్టీ అధిష్ఠానం తనను గౌరవించట్లేదనే అభిప్రాయంలో పల్లె రఘునాథ రెడ్డి ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఆ సామాజిక వర్గ నాయకుల పెత్తనమే కారణమా?
దీనికి కొన్ని కారణాలను కూడా వారు ఉదహరిస్తున్నారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గ నాయకుల పెత్తనం అధికంగా ఉందనే అభిప్రాయాలు చాలారోజుల నుంచీ వినిపిస్తున్నాయి. మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరాములు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, అనంతపురం, ళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి వంటి నాయకలు ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. గతంలో నల్లమాడ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత పుట్టపర్తి నుంచి వరుసగా గెలుస్తూ వస్తోన్న పల్లె రఘునాథ రెడ్డి ఎప్పుడూ జిల్లా రాజకీయాలపై పైచేయి సాధించట్లేదని అంటున్నారు.
పుట్టపర్తి రాజకీయాల్లో పరిటాల కుటుంబం జోక్యం..
దీనికితోడు- తాజాగా పరిటాల కుటుంబం పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటుండటం కూడా పల్లె రఘునాథ రెడ్డికి మింగుడు పడని విషయమని తెలుస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని కొన్ని గ్రామాలపై పరిటాల శ్రీరాములు ఆధిపత్యాన్ని చూపుతున్నారని, ఈ విషయాన్ని పల్లె రఘునాథ రెడ్డి పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం. పుట్టపర్తి నియోజికవర్గంలో మంచి పట్టు ఉన్న ఇతను ఇప్పుడు వైసీపీ లోకి వెళ్ళడం టీడీపీ నేతలకు మింగుడు పడడంలేదు. నిజానికి పల్లె రఘునాథ రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరితే దానికి కారణం చంద్రబాబే అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
రాజ్యసభ సీటు ఖాయం చేస్తే..
ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు పోటీ చేయబోనని, రాజ్యసభకు పంపించాలని పల్లె రఘునాథ రెడ్డి కోరగా.. చంద్రబాబు పట్టించుకోకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ.. చంద్రబాబు తనను పట్టించుకోవట్లేదని పల్లె రఘునాథ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారనే వార్తలు ఇప్పటికి కావు. పల్లెను మంత్రివర్గం నుంచి తొలగించిన తరువాత..అప్పటిదాకా ఆయన ఆధీనంలో ఉన్న ఐటీ మంత్రిత్వశాఖను చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు అప్పగించారు. పల్లెకు వేరే శాఖ కూడా అప్పగించలేదు. దీన్ని అవమానకరంగా భావించిన పల్లె రఘునాథ రెడ్డి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.
పరిటా శ్రీరామ్ వివాహ సమయంలోనూ పల్లె రఘునాథ రెడ్డి ఇదే వైఖరిని అనుసరించిన విషయం తెలిసిందే. ఇంతా జరిగిన కూడా చంద్రబాబు ఏనాడూ పల్లె రఘునాథ రెడ్డిని బుజ్జగించిన సందర్భాలు లేవని, ఆయనపై వివక్ష చూపించారని చెబుతున్నారు పుట్టపర్తి నాయకులు. సీనియర్ అయినప్పటికీ రాజ్య సభ టికెట్ ఇవ్వకపోవడం , గతంలో మంత్రి పదవి నుండి తొలగించడం ఇవ్వన్నీ అవమానంగా భావించిన పల్లె పార్టీ నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అనంతపురం జిల్లాలో కూడా వైఎస్ఆర్ సీపీ హవా నడుస్తుందని భావిస్తోన్న ఆయన ప్రతిపక్షంలో చేరడానికి సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభకు పంపించాలనే ఏకైక షరతుతో పల్లె రఘునాథ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నాయకులను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి ఇన్ఛార్జిగా ప్రస్తుతం దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన నాలుగేళ్ల నుంచి ఇన్చార్జిగా ఉంటున్నారు. పుట్టపర్తి తెలుగుదేశంలో నెలకొన్న అంతర్గత కలహాలు ఈ సారి తన విజయానికి దోహదం చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. పుట్టపర్తి ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఆయన పర్యటించారు. స్థానికులతో కలిసి సాగుతున్నారు. ఈ సారి ఆయనకే టికెట్ ఖాయం అనేది తెలిసిన విషయమే.
2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో దుద్దుకుంట అభ్యర్థిత్వం ఖరారైంది. అప్పటిదాకా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎవరనేది తెలియలేదు. పైగా పల్లె రఘునాథ రెడ్డికి సౌమ్యుడు, వివాద రహితుడనే పేరు ఉండటం వల్ల గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఈ స్థానాన్ని కోల్పోయింది. ఈ సారి పల్లె తమ పార్టీలోకి రావడం ఖాయమే అయితే, రాజ్యసభ సీటు ఇచ్చినా ఆశ్చర్యంపోనక్కర్లేదని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు.