ఆ బిజెపి ఎమ్మెల్యే...అనుకూల శత్రువా?...ప్రతికూల మిత్రుడా?...ఎవరికి?
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనసులో ఏముందో ఎవరూ కనిపెట్టలేరు. ఎందుకంటే?...ఆయన మాటలు అలా ఉంటాయి...ఏ వ్యక్తినైనా తెగ విమర్శిస్తారు...ఆరోపణ అస్త్రాలు వరుసబెట్టి సంధిస్తారు...ఔనా అనుకునేలోపే...అంతలోనే మళ్లీ అదే వ్యక్తిపై పొగడ్తల వర్షం కురిపిస్తారు...వారి అంతటి వారు లేరని మెచ్చుకుంటారు....అరే ఇదేంటిలా అనుకునేలోపే మళ్లీ వాళ్ల మీదే విమర్శల పర్వం మొదలవుతుంది...ఇది అలా అలా సాగిపోతూనే ఉంటుంది.
అయితే అలాంటి విష్ణుకుమార్ రాజు ఇటీవల వైసిపిని, ఆ పార్టీ అధినేత జగన్ ని తెగపొగిడేస్తున్నారు. జగన్ అంతటివాడు లేడంటున్నారు. ఆ పార్టీ గ్రాఫ్ ఎంతో పెరిగిపోయిందంటున్నారు. అధికారంలోకి వచ్చేది వైసిపినే నని కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. అయితే ఈ బిజెపి ఎమ్మెల్యే పొగడ్తలు వైసిపికి లాభం చేకూరుస్తాయా? లేక నష్టం కలిగిస్తాయా?...అసలు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏమిటి?...ఇప్పుడు ఈ సందేహాలకే రాజకీయ పరిశీలకులు సమాధానం కోసం ప్రయత్నిస్తున్నారు.
విష్ణుకుమార్ రాజు...తాజా వ్యాఖ్యలు..
గతం గతం: అన్నట్లు బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గతంలో చంద్రబాబును, జగన్ ను ఉద్దేశించి చాలా రకాల వ్యాఖ్యలు చేసినా ఆనాటి సందర్భాలు వేరు కాబట్టి తాజాగా చేసిన వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకొందాం. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేటెస్ట్ కామెంట్లు ఏమిటంటే?...సీఎం నారా చంద్రబాబు చేస్తున్న పోరాటం ధర్మ పోరాటం కాదని, అధర్మ పోరాటమని ఆయన విమర్శించారు. జగన్ ఏం చెబితే చంద్రబాబు అదే చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని గుర్తు చేశారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని విష్ణు జోస్యం చెప్పారు. చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని, అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు.
అందరిలో ఆశ్చర్యం...కారణమిదే...
అసలు ఏ పార్టీ నేత అయినా తమ పార్టీ గ్రాఫ్ గురించి మాట్లాడటమో...ప్రత్యర్థి గ్రాఫ్ పడిపోయిందని చెప్పడమో చేస్తారు. కానీ ఈ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్టైలే సెపరేట్ కాబట్టి ఈయన ప్రస్తుతం తన రెండు ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడుతూ ఒక పార్టీ వీక్ అయిందని, ఆ పార్టీ తన ప్రత్యర్థి పార్టీ మీద ఓడిపోతుందనే కామెంట్లు చేయడం ఒక్క విజయకుమార్ రాజుకే సాధ్యం అని చెప్పుకోవచ్చు. అయితే విచిత్రంగా విష్ణు కుమార్ రాజు చేస్తున్న వాఖ్యలు టిడిపిలో వర్గాలకు కంటగింపుగా లేకపోవడం...వైసిపి మద్దతుదారుల్లో ఇబ్బందిని కలుగజేస్తుండటం గమనార్హం.
ఆ పొగడ్తలతో...అనుకూల శత్రువా?...
బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవలి కాలంలో వైసిపిని, జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఆ పార్టీకి ఎంతో అనుకూలంగా మాట్లాడుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల జగన్ పాదయాత్రపై ప్రశంసలతో తన పొగడ్తలు ప్రారంభించిన ఈ బిజెపి ఎమ్మెల్యే ఇక క్రమం తప్పకుండా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. పాదయాత్ర చేపట్టిన జగన్ ధైర్యసాహసాలు అభినందనీయమని, జగన్కు తమ ఇంట్లో కూడా అభిమానులున్నారని, తన మామ జగన్ ను ఇష్టపడతారని ఆయన కోసం జగన్ ని కలవాలని అనుకుంటున్నానని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే బిజెపి ఎమ్మెల్యే కురిపిస్తున్న ఈ పొగడ్తల వర్షం వైసిపికి లాభం గానో నష్టం గానో పరిణమించడం మాత్రం గ్యారెంటీ అనే చెప్పుకోవచ్చు. ఎలా అంటే?
వైసిపికి...లాభమా? నష్టమా?
ఈ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసే వ్యాఖ్యల వల్ల వైసిపికి నష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలా అంటే...ఈ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలను బట్టి టిడిపి ఆరోపిస్తున్నట్లు నిజంగానే బిజెపి, వైసిపి కలసిపోతాయోమో అందుకే ఆయన అంత అనుకూలంగా మాట్లాడుతున్నాడనే సందేహం కామన్ మ్యాన్ లో రావడం కామన్. దీనికి జగన్ కేంద్రంపై గాని, మోడీ పై గాని తీవ్ర విమర్శలు చేయకపోవడం కలిపి ఆలోచించినప్పుడు ఆ లనుమానం మరింత బలపడుతుంది. అలాంటప్పుడు ప్రధానంగా వైసిపి ఓటు బ్యాంకు దన్నుగా ఉన్న వర్గాలు ముస్లింలు,దళితులు, క్రైస్తవులు ఈ పార్టీ పట్ల విముఖత పెంచుకోవచ్చు. ఈ వర్గాలకు వైఎస్ తనయుడిగా, తమకేదో అనుకూలంగా వ్యవహరిస్తాడనే ఆశతో జగన్ పై ఎంత ప్రేమ ఉన్నా తమ మనుడగకే ప్రమాదం గా భావించే బిజెపితో ఆ పార్టీ జత కలవడాన్ని పరోక్షంగానైనా సరే...ఈ వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించలేవు.
టిడిపికి...ప్రతికూల మిత్రుడిలా
ఇక బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసిపిపై కురిపించే ప్రశంసల వర్షం...తమ పార్టీపై విమర్శల దాడి ఆ పార్టీకి సంతోషాన్నే ఇస్తున్నాయంటే అబద్దం లేదు. అదెలాగంటే?...రాష్ట్ర ప్రయోజనాల కోసం మిత్ర పక్షం బిజెపితో తెగతెంపులు చేసుకొని శత్రువుగా మారిన తమ పార్టీపై ఆ పార్టీ విమర్శలు చేయడం సర్వసహజం గానే కామన్ మ్యాన్ భావిస్తాడని, ఆ విమర్శలను పరిగణనలోకి తీసుకోడని టిడిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో వైపు చూస్తే బిజెపి ఎమ్మెల్యే వైసిపిని అదే పనిగా పొగడటం వల్ల తాము ఆరోపిస్తున్నట్లే నిజంగానే ఆ పార్టీలు రెండు కలసిపోతున్నాయని, కాని పక్షంలో లోపాయికారీగా లాలూజీ పడి నటిస్తున్నాయని విమర్శించడానికి టిడిపి కి మంచి ఆయుధాలు సమకూరుతున్నాయి. అంతేకాదు బిజెపిని బూచిగా చూపించి జగన్ ప్రధాన ఓటు బ్యాంకు వర్గాలు ముస్లింలు,దళితులు, క్రైస్తవుల్లో చాలామందిని తమవైపుకు తిప్పుకునే అవకాశం లభిస్తోంది.
దీన్ని బట్టి...వైసిపికి డ్యామేజీనే
అయితే పికె లాంటి ప్రసిద్ద వ్యూహకర్తతో సహా పలువురు సీనియర్ నేతలు ఉన్న వైసిపి ఈ విషయాన్ని పసిగట్టలేకపోతోందా? లేక తెలిసి కూడా మౌనం వహించాల్సిన పరిస్థితి ఉందా?...అని పరిస్థితిని విశ్లేషించేందుకు రాజకీయ పరిశీలకులు ప్రయత్నిస్తున్నారు. బిజెపిలో ఉంటూ వైసిపికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తూ...ఆ పార్టీ ఓటు బ్యాంకు మూలాలను దెబ్బతీయడం...అదే సమయంలో టిడిపిపై విమర్శలు చేయడం ద్వారా తామిద్దరూ ఒకటి తమ ప్రత్యర్ధి టిడిపి అనే అభిప్రాయం ప్రజల్లో రప్పించడం...టిడిపి ఈ రెండు పార్టీలపై చేసే విమర్శలు నిజమేననే వాతావరణం కల్పించడం...తో ఈ బిజెపి ఎమ్మెల్యే చివరకు జగన్ కొంప ముంచడం మాత్రం ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.