చిరుపై బాలయ్య వ్యాఖ్యలు: ఓవరాక్షనేనా?, తప్పుబడుతున్న ఫ్యాన్స్
అమరావతి: ఫిబ్రవరి 27, 28వ తేదీలలో తన నియోజకవర్గంలో రూ. 4 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ముందుండి చూసుకుంటున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ఉత్సవాలకు అటు కేంద్ర మంత్రులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను కలిసి స్వయంగా ఆహ్వానపత్రాలను అందజేసి ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఏపీ సీఎం చంద్రాబబుని ఆహ్వానించిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
Also Read: చిరుని పిలవలేదు, నెత్తిన ఎక్కించుకోను: బాలకృష్ణ, చేరికలపై తడబాటు
ఈ మీడియా సమావేశంలో లేపాక్షి ఉత్సవాలకి చిరంజీవిని ఆహ్వానించారా? అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినీ పరిశ్రమ నుంచి మోహన్ బాబు, జయసుధను తప్ప మరెవరినీ పిలవలేదని అన్నారు.
నేను ఎవరిని నెత్తిన ఎక్కించుకోనని, నా నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీ నుంచి తాను ఎవరినీ పిలవలేదని చెప్పిన ఆయన నా పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లతోనే కలిసి ప్రయాణిస్తానని అన్నారు. లేపాక్షి ఉత్సవాలు నా కష్టార్జితమని, ఎవరిని పిలవాలో ఎవరిని పిలకూడదో తనకు తెలుసని అన్నారు.
ఉత్సవాలకు రకరకాల మనుషులు వస్తుంటారని, నేను నా పద్ధతిలోనే వెళతానని అన్నారు. డిక్టేటర్ పద్ధతిలోనే వెళతానని చమత్కరించారు. మీడియా సమావేశంలో చిరంజీవి ప్రస్తావన రాగానే బాలకృష్ణ కళ్లు కాస్త పెద్దవి చేసి తనదైన శైలిలో మాట్లాడారు. అయితే చిరంజీవి గురించి ఈ విధంగా అనుచితంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అభిమానులు మండిపడుతున్నారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కనుక ఉత్సవాలకు పిలవకూడదని అనుకుంటే అనుకొవడంతో తప్పులేదంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీని ఉద్దేశ్యించి ‘ఎవరినీ నెత్తికి ఎక్కించుకోను..నా పక్కన నిలబడితే చాలా మందికి గ్లామర్ వస్తుందని' చెప్పడం చాలా అసందర్భంగా, అనుచితంగా ఉందంటున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ సహా ఎవరి అభిమానులు వారికి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న టాప్ హీరోలంతా చిరంజీవి కుటుంబ సభ్యులే. అసలు తెలుగు సినిమా బిజినెస్ మొత్తం రన్ అయ్యేది వారి వల్లనే.
అలాంటి చిరంజీవి పట్ల బాలకృష్ణ అనుచితంగా ఎందుకు మాట్లాడరంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏదో చిన్న చిన్న హీరోలు వచ్చి ఆయన పక్కన నిలబడితే వారికి గ్లామర్ వస్తుందేమో కానీ చిరంజీవికి కాదు. ఆయనని అమితంగా ఆరాధించే అభిమానులు రెండు రాష్ట్రాలలో బోలెడుమంది ఉన్నారనే విషయాన్ని బాలకృష్ణ గ్రహించాలంటున్నారు.
ఇటీవల బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాలో మంచి డైలాగులతో అభిమానులను ఆకట్టుకున్నారు. సినిమాలో మాదిరి డిక్టేటర్ స్టైల్, నేను డిక్టేటర్ని అంటూ ఆయన చెప్పిన డైలాగులు చాలా గొప్పగా ఉండవచ్చును. కానీ రాజకీయాల్లో అలాంటివి పనికిరావని, అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ‘ఇది నా కష్టార్జితం' అని బాలకృష్ణ చెప్పడం కూడా సరికాదు. సినీ ఇండస్ట్రీలో తాను చాలా కష్టపడి పైకి ఎదిగానని చెప్పుకోవడంలో తప్పు లేదు గానీ, సహా నటుల గురించి మీడియాలో చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. లేపాక్షి ఉత్సవాలను ప్రజాధనంతో నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణ సొంత డబ్బులతో కాదనే విషయాన్ని కూడా ఆయన గుర్తుంచుకోవాలి. అయితే లేపాక్షి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం కోసం ఆయన తన భుజానికి ఎత్తుకొన్నందుకు మాత్రం అభినందించాల్సిందే. కానీ ఈ కార్యక్రమానికి ఎవరిని పిలవాలో ఎవరిని దూరంగా ఉంచాలో ఆయన నిర్ణయిస్తానని చెప్పడం సరైంది కాదని పలువురి వాదన.
దేశవ్యాప్తంగా లేపాక్షికి గుర్తింపు తెచ్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే లేపాక్షి ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం 4 కోట్ల రూపాయాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.