టీడీపీ ప్రతిపక్ష హోదాపై వైసీపీ గురి పెట్టిందా? అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ పని పూర్తవుతుందా?
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో వ్యూహాత్మక ఎత్తుగడలతో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ముందుకు వెళ్లనున్నాయి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ని దెబ్బతీసే వ్యూహాత్మక ఎత్తుగడతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాపై అధికార పార్టీ గురి పెట్టిందా? అందుకు అనుగుణంగా వైసీపీ కార్యాచరణ మొదలుపెట్టిందా? అంటే అవుననే భావన వ్యక్తమవుతోంది.
మంత్రి నాని వర్సెస్ టీడీపీ: మేము మేనిఫెస్టోలో చెప్పలేదు..సాక్షిలో తప్పు రాసారు: సభలో సీఎం జగన్..!
టీడీపీకి చెక్ పెట్టే ప్లాన్ లో వైసీపీ ?
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. తొలిరోజే ఘాటుగా విమర్శలతో సభ దద్దరిల్లింది. ఇక నేడు రెండో రోజు సభ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఏపీలో పలువురు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునే వ్యూహాత్మక ఎత్తుగడ తో వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఒకవేళ అదే కనుక సాధ్యమైతే అసెంబ్లీలో టీడీపీ కి ప్రతిపక్ష హోదా గల్లంతు కావడం ఖాయమని చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు ఆ దిశగా వైసీపీ పావులు కదుపుతుందా అన్న చర్చ సాగుతుంది .
ఇప్పటికే టీడీపీకి దూరంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
ఈ వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామాలు జరగనున్నాయి అన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సభలో తెలుగుదేశం పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉన్నారు. ఇక ఏపీ శాసనసభ సమావేశాలలోనూ సోమవారం సభ ప్రారంభానికి ముందు వంశీని టీడీఎల్పీ కార్యాలయంలోకి ఆహ్వానించినా ఆయన టిడిఎల్పి ఆఫీస్ లోకి వెళ్ళని పరిస్థితి.
టీడీపీ ఎమ్మెల్యేలు ఆరుగురు జంప్ అయితే చాలు
ఇక ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలకు వైసీపీ గురి పెట్టిందని తాజా పరిణామాలతో తెలుస్తుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసేలోగా టిడిపి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేస్తే టీడీపీని దెబ్బ కొట్టినట్టుగా ఉంటుందని వైసిపి నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పుడున్న 22 మంది సభ్యుల్లో ఆరుగురు సభ్యులు పార్టీ మారితే టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య 16కు పడిపోతుంది. మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో ఒకవేళ అదే జరిగితే టీడీపీకి కేవలం 16 మంది సభ్యులు మాత్రమే ఉంటే అప్పుడు టిడిపి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు అవుతుంది.
వైసీపీ ప్లాన్ సక్సెస్ అయితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోయే ప్రమాదం
కేవలం 16 మంది సభ్యులు అంటే 10 శాతం కంటే తక్కువ కావడంతో ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా అని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సాధారణ ఫ్లోర్ లీడర్ స్థాయికి చంద్రబాబు హోదా పడిపోతుంది. అయితే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించిన నేతలు ఎవరైనా పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పటమే,ఏపీలో ఎమ్మెల్యేలకు ఇప్పుడు కంటకంగా మారింది. ఇక ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా బాహాటంగానే చెబుతున్నారు.
జగన్ పెట్టిన నిబంధనతోనే సమస్య .. అయినా చంద్రబాబును దెబ్బకొట్టే పనిలో వైసీపీ
ఆ ఒక్క నిబంధన లేకపోతే టీడీపీ ఎప్పుడూ ఖాళీ అయ్యేదని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, టిడిపిలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న కొందరు, వైసిపి బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్వయంగా వైసిపి నేతలు చెబుతున్న పరిస్థితి.ఏదేమైనప్పటికీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే,వైసీపీ వైపు చూస్తున్న నేతలను ఆకర్షించి, టిడిపి ఎమ్మెల్యేలను పార్టీకి గుడ్ బై చెప్పేలా చూసి చంద్రబాబును భౌతికంగా మానసికంగా దెబ్బ కొట్టాలని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. ఇక అదే కనుక జరిగితే ఇప్పటివరకు ఇచ్చిన అన్ని షాక్ ల కంటే ఇది అతిపెద్ద షాక్ అని చెప్పొచ్చు.