అది గుర్తుంచుకోవాలిగా.. షాకిస్తున్నారు: కన్ఫ్యూజన్గా పురంధేశ్వరి వ్యాఖ్యలు!
అమరావతి: గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూనే, పొత్తులపై సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తామని, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాలు టీడీపీ, కాంగ్రెస్లు పొత్తుతో వెళ్లకపోయినా అవగాహనతో వెళ్తాయనే చర్చ సాగుతోంది.
ఎవరున్నా అంతే: అన్నయ్యపై పోటీకి సై, కిరణ్ రెడ్డి అనుచరుల ఆగ్రహం! ఇదీ లెక్క
దీనిపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం తీవ్రంగా స్పందించారు. అయితే, ఆమె మాటల్లో క్లారిటీ లేదనేది చాలామంది వాదన. అసలు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ - టిడిపి పొత్తుపై ఆమె మాట్లాడటం విడ్డూరంగా ఉందని కూడా అంటున్నారు.
పురంధేశ్వరి ఏమన్నారంటే?
ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ - టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తానని పురంధేశ్వరి అన్నారు. టీడీపీ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అన్నారు. ఆ రెండు పార్టీలు ఎలా పొత్తు పెట్టుకుంటాయని ప్రశ్నించారు. అదే సమయంలో విభజన సమయంలో ద్రోహిలా కనిపించిన కాంగ్రెస్ ఇఫ్పుడు టీడీపీకి ఎలా నచ్చుతోందని ప్రశ్నించారు. కాంగ్రెస్తో టీడీపీ పొత్తు విషయమై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా స్వాగతిస్తారో చూడాలన్నారు. ఈ రెండు పార్టీల పొత్తును ఎన్టీఆర్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తారన్నారు. వీరి పొత్తుపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఇలా మాట్లాడేటప్పుడు గతం గుర్తుంచుకోవాలి
అయితే పురంధేశ్వరి వ్యాఖ్యలపై భిన్నమైన చర్చ సాగుతోంది. అసలు యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, కేంద్రమంత్రిగా పురంధేశ్వరి పని చేశారని, అప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషించిందా అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో గతం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
కేవలం చంద్రబాబును వ్యతిరేకించాలనే
కేవలం చంద్రబాబును వ్యతిరేకించాలనే ఉద్దేశ్యంతో అనాలోచితంగా మాట్లాడవద్దని అంటున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి, యూపీఏ హయాంలో కేంద్రమంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురాలేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయని అంటున్నారు.
పొత్తు పెట్టుకుంటే సంచలనమే
కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ప్రభుత్వం కోసం చూస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇలాంటి పార్టీ కాంగ్రెస్తో పొత్తు కాకపోయినా అవగాహన కుదుర్చుకున్నా అది సంచలనమే అవుతుందని అంటున్నారు. ఏపీ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో పొత్తుపై చర్చలు సాగుతున్నాయని అంటున్నారు.