రాజధాని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం వెనుక ఆంతర్యం అదేనా? ఏం జరుగుతుంది?
రాజధాని అమరావతి ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతి ఉద్యమ విచ్ఛిన్నానికేనా ? అన్న చర్చ ఏపీలో తాజాగా సాగుతుంది .రాజధాని అమరావతి పరిధిలో ఉన్న 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక కుట్ర దాగుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
సీఎం జగన్ తాజా వ్యూహం ..మూడు రాజధానుల కోసం.. టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ కార్యాచరణ
రాజధాని అమరావతి రైతుల్లో చీలిక తెచ్చే ఎత్తుగడ అంటూ విమర్శలు
పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, వడ్డేశ్వరం, గుండిమెడ, పాతూరు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా అమరావతి గ్రామాల రైతులు ఉద్యమిస్తున్న తరుణంలో చేసిన ఈ కీలక ప్రకటన , తీసుకున్న నిర్ణయం కేవలం రాజధాని అమరావతి రైతుల్లో చీలిక తెచ్చే ఎత్తుగడ అని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ సర్కార్ మరో వివాదానికి తెర తీసిందనే విమర్శలు
ప్రభుత్వం జారీ చేసిన రాజధాని గ్రామాల తొలగింపు, మున్సిపాలిటీల్లో విలీనం చెయ్యాలనే నిర్ణయం నోటిఫికేషన్ ప్రభావం వల్ల అమరావతి గ్రామాల పరిధి, స్వరూపం కొంతవరకు మారిపోయినట్టయింది. అయితే దీంతో వైసీపీ సర్కార్ మరో వివాదానికి తెర తీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాలే లేకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు . అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోవడానికి కొత్త ఎత్తుగడను వేసిందని విమర్శిస్తున్నారు రాజధాని గ్రామాల ప్రజలు .
రాజధాని గ్రామాల ఆకస్మిక తొలగింపు వెనుక కుట్ర కోణం ఉందన్న రాజధాని ప్రజలు
ఇక ఈ గ్రామాల సత్వర అభివృద్ధి కోసమే రాజధాని పరిధి నుంచి తొలగించి మున్సిపాలిటీల్లో చేర్చామని ప్రభుత్వం చెప్తున్నా అందులో ఏ మాత్రం వాస్తవం లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని నగర పరిధిలోని 29 గ్రామాలకు మరో 3 పంచాయతీలను కలిపి అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఇక వాటిలో 5 గ్రామాలను ఆకస్మికంగా తొలగించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు . దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు.
అమరావతి నిర్వీర్యమే లక్ష్యంగా నిర్ణయం .. న్యాయ పోరాటం చేస్తామంటున్న రైతులు
అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ పనిచేశారన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం మున్సిపాలిటీలలో విలీనం చేసిన గ్రామాలు సుమారు 30 శాతం ఉండటం , తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి భూసేకరణ వ్యతిరేకించిన రైతుల్లో అత్యధికులు ఈ గ్రామాలకు చెందిన వారే ఉండటంతో ఈ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఉద్యమకారుల్లో చీలికలు తెచ్చి.. నిరసనల తీవ్రతను తగ్గించినట్టు అవుతుందని భావించిన వైసీపీ సర్కార్ ఈ కుట్ర చేసిందనేది రాజధాని గ్రామాల ప్రజల ఆరోపణ . ఇక ఈ నిర్ణయంపై కూడా రాజధాని గ్రామాల రైతులు ప్రభుత్వ కుట్రపై హైకోర్టులో సవాల్ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.