రోజాపై కుట్ర: ప్రత్యర్థి వ్యూహానికి ఉక్కిరిబిక్కిరి.. జగన్ ఇకనైనా మేలుకుంటారా?
ఏపీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రోజా విషయంలోను ఇప్పుడిలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయవాడ: రాజకీయాల్లో ప్రత్యర్థిని నిలువరించాలంటే.. వాళ్లపై ప్రత్యక్ష యుద్దం కన్నా పరోక్ష యుద్దం చేయడమే చాలామంది అనుసరించే మార్గం. ఒకవిధంగా మైండ్ గేమ్తో దెబ్బకొట్టే ప్లాన్ అన్నమాట. దీనికి మీడియా మేనేజ్మెంట్ కూడా తోడైతే.. అద్భుతమైన కథనాలను వండివార్చి ప్రత్యర్థిని తెగ ఇరుకునపెట్టేయచ్చు.
ఏపీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రోజా విషయంలోను ఇప్పుడిలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనం నిజనిజాలను విశ్లేషించుకునేంత గ్యాప్ కూడా ఇవ్వకుండా.. కథనాల మీద కథనాలతో వ్యూహాస్త్రాలు సంధించి.. ప్రత్యర్థికి ఊపిరి సలపకుండా చేయడంలో అధికార పార్టీ హస్తం ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఇదీ ప్లాన్!?:
అందుకే తమ చేతులు కాలకుండా.. సొంతగూటిలోనే కుంపటిని రగిలించేలా రోజాపై కుట్ర జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. గత రెండు మూడు రోజులుగా రోజాపై మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తొలుత రోజాతో జగన్కు విభేదాలంటూ మొదలుపెట్టి.. ఆపై ఆమె ఏకంగా జనసేనలోకి జంప్ అవుతున్నారంటూ తాజాగా మరో కొత్త వార్తను తెర పైకి తీసుకొచ్చారు.
వండివార్చినవేనా?:
ఈ కథనాలన్ని ఊహాగానాల కన్నా వండివార్చిన కథనాలే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా రోజాకు ఉన్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను ఎదుర్కోలేకే.. ఆమె అంటే గిట్టనివారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్న చర్చ అటు వైసీపీలో జరుగుతోంది. రోజాను ఆ పార్టీకి దూరం చేయడమంటే.. వైసీపీకి పెద్ద డ్యామేజే కాబట్టి.. ఆమె పార్టీ మారబోతున్నారు? జగన్ ఆమెకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నారు? వంటి కథనాలతో పరోక్షంగా ఈ ప్లాన్ను ఆచరణలో పెడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
అంతుచిక్కని రోజా మౌనం:
వచ్చే ఎన్నికల నాటికి అధికారం మాదే అంటూ ధీమాతో ఉన్న జగన్కు సైతం.. ఇలాంటి పరిణామాలు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. రాజకీయంగా ఆ పార్టీ భవితవ్యానికి పెద్ద దెబ్బలే తగలవచ్చు. ఇదిలా ఉంటే, పార్టీ వ్యవహారమైనా వ్యక్తిగత వ్యవహారమైనా ప్రత్యర్థుల్ని తన మాటలతో బెదరగొట్టే రోజా.. ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
జగన్ మేలుకోకపోతే నష్టమే!
ఈ విషయంలో రోజా గనుక ఇలాగే మౌనంగా వ్యవహరిస్తే.. జగన్తో తనకు విభేదాలున్నాయని పరోక్షంగా సంకేతాలు పంపించినట్లు అవుతుంది. అదే జరిగితే.. ఈ వ్యవహారమంతా అధికార పార్టీకి మేలు చేకూర్చేదిగా మారి.. ప్రత్యర్థి పన్నిన వ్యూహంలో వైసీపీ చిక్కుకున్నట్లవుతుంది. కాబట్టి వైసీపీ శ్రేణులు ఇప్పటికైనా మేలుకుంటాయో లేదో చూడాలి!