ఇలాంటి లొసుగులతో టీడీపీకి కష్టమే!, తమ్ముళ్లంతా డమ్మీలా.. బాబు ఒక్కరే కష్టపడుతున్నారా..
Recommended Video
న్యూఢిల్లీ/అమరావతి: అధినేత ఢిల్లీలో ఉన్నారు.. తమ్ముళ్లేమో ఇక్కడ రిలాక్స్ అయిపోయారన్న విమర్శలు తెలుగుదేశం పార్టీపై వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులు అధినేతను అంతలా టార్గెట్ చేస్తుంటే.. కనీసం తిప్పికొట్టడానికి కూడా వాళ్లెవరూ ఆసక్తి చూపించడం లేదట.
తెలుగుదేశాన్ని ఆకాశానికేత్తేసే అనుకూల మీడియా నుంచి ఇటువంటి విమర్శలు వినిపిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా పార్టీలో చంద్రబాబు తప్ప.. మిగతావాళ్లంతా డమ్మీల్లా మారిపోయారనే రీతిలో ఓ కథనం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగినా.. ఆయనే చూసుకుంటారన్న ధోరణి టీడీపీ నేతల్లో పెరిగిపోయిందన్నది దాని సారాంశం.
సమన్వయ లోపం:
పార్టీలో నం.1 నుంచి మొదలుపెడితే 10వరకు అన్నింట్లోనూ చంద్రబాబే ఉంటారు. ఆయన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పార్టీని, నేతలను కమాండ్ చేసే నాయకుడెవరూ లేరు. దీనికి కారణాలేవైనా ఉండవచ్చు కానీ.. దీనివల్ల పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఏర్పడిందని అంటున్నారు.
చంద్రబాబు లేని సమయంలో ఎవరో ఒకరు ముందు పడి పార్టీని సమన్వయం చేయాల్సిందిపోయి.. ఎవరికి వారు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట.
మీడియా పాయింట్ వద్దకే రావట్లేదట..:
అవిశ్వాస తీర్మానం.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. జాతీయ నాయకులతో భేటీ.. వంటి అంశాలను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదట.
ఓవైపు హోదా పోరాటాన్ని తమ క్రెడిట్గా మలుచుకునేందుకు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తున్నవేళ.. టీడీపీ నేతలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం కచ్చితంగా సమన్వయ లోపమే అంటున్నారు.
హోదా పోరాటానికి సంబంధించిన అప్డేట్స్ కానీ, చంద్రబాబుపై విమర్శలను తిప్పికొట్టడానికి కానీ.. కనీసం మీడియా పాయింట్ వద్దకు రావడానికి కూడా వారు ఆసక్తి చూపించడం లేదట.
విజయసాయి అంతలా విమర్శిస్తున్నా..:
హోదాపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నవేళ.. టీవీ చర్చల్లోనూ టీడీపీ గొంతును బలంగా వినిపిస్తున్నట్టు కనిపించడం లేదట. వ్యక్తిగత పనుల మీద ఉన్న శ్రద్ద.. పార్టీ మీద ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.
చంద్రబాబును విజయసాయిరెడ్డి అంతలేసి మాటలన్న తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి ఆసక్తి కనబర్చలేదట. ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు తీసుకురావాల్సిన విప్లు కూడా ఎవరూ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదట.
ఇలాంటి లొసుగులతో కష్టమే..:
అన్నింటికి చంద్రబాబే రావాలి.. అన్నీ ఆయనే చూసుకుంటారన్న ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ఆ పార్టీకి గట్టి దెబ్బ తప్పదంటున్నారు పరిశీలకులు. అయితే ప్రచారంలో ఉన్నదంతా నిజమైపోదు కదా అన్న వాదన కూడా లేకపోలేదు. కేవలం అధినేత మాత్రమే కష్టపడుతున్నారన్న ప్రచారం సరైంది కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా.. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇలాంటి లొసుగులు టీడీపీకి ప్రతిబంధకమనే చెప్పాలి.