సంచలనం: 'భారీ స్కాం, మోడీ కాపాడలేదనే బాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చారా?'
అమరావతి: ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ పీడీ అకౌంట్స్ అని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు సోమవారం నాడు మండిపడ్డారు. రూ.53వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆ మొత్తం కూడా దారి మళ్లించినట్లు రుజువైందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
జనసేనలో ముత్తాకు కీలక పదవి!: ఆ ఇంగ్లీష్ ఛానల్ షోలో హోస్ట్గా పవన్ కళ్యాణ్
ఈ కుంభకోణం 2జీ, బొగ్గు, సిడబ్ల్యుసి, ఫోడర్ స్కాంల మాదిరిగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భారీ కుంభకోణం నుంచి ప్రధాని మోడీ తమను బయటపడేయలేదనే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందా అని సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రెండు రోజులుగా జీవీఎల్, ఏపీ ప్రణాళికా సంభం ఉపాధ్యక్షులు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
జీవీఎల్కు కుటుంబరావు సవాల్
వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల(పీడీఏలు)లోని సొమ్మును కుంభకోణంగా పేర్కొనడం జీవీఎల్ అజ్ఞానానికి నిదర్శనమని కుటుంబరావు ఆదివారమే కౌంటర్ ఇచ్చారు. పీడీ ఖాతాలంటే నిర్వచనమైనా తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వాధికారులు నిర్వహించే ఈ ఖాతాలపై అపోహలు సృష్టించడం మానుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 58,539 పీడీ ఖాతాలకు రూ.26వేల కోట్ల కేటాయింపులున్నట్లు కాగ్ నివేదికలో వెల్లడించిందని, ఖాతాల్లో రూ.50వేల కోట్లకు పైగా నిధులుంటే అప్పులు చేయాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. పీడీ ఖాతాల నిర్వహణ పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే తొలిసారిగా సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానాన్ని(సీఎఫ్ఎంఎస్) ప్రారంభించామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సౌకర్యానికి అనుగుణంగా పీడీ ఖాతాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోనూ అలాంటివి 28వేలకు పైగా ఉన్నాయన్నారు. కాగ్ నివేదికను తొక్కిపెట్టామనడంలో నిజం లేదని, వెబ్సైట్లో ఎవరికైనా అందుబాటులో ఉంటుందన్నారు. అవినీతిపై ఆధారాలుంటే ఫిర్యాదు చేయాలన్నారు. జీవీఎల్కు చేతనైతే వార్డు మెంబరుగానైనా గెలవాలని సవాల్ విసిరారు.
జీవీఎల్కు నిలదీత
రాఫెల్లో రూ.29వేల కోట్ల స్కాం జరిగిందని కుటుంబరావు ఆరోపించారు. రష్యా సంస్థకు విక్రయించిన ఎస్సార్ ఆయిల్కు సంబంధించి రూ.40వేల కోట్లను హవాలా మార్గంలో విదేశీ ఖాతాలకు తరలించారన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. గుజరాత్లోనూ రూ.21వేల కోట్ల వివాదాస్పద లావాదేవీలు జరిగాయని కాగ్ పేర్కొన్న అంశాలపై మాట్లాడే దమ్ము జీవీఎల్కు ఉందా అని నిలదీశారు.
షేర్ మార్కెట్ బ్రోకర్తో సమాధానమా?
సుమారు రూ.53వేల కోట్ల తాత్కాలిక పీడీఏ స్కాంపై ప్రజలకు సమాధానం చెప్పకుండా షేర్ మార్కెట్ బ్రోకర్తో కౌంటర్ ఇప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కుటుంబరావును ఉద్దేశించి జీవీఎల్ ఆదివారమే కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు కావాల్సింది కౌంటర్లు కాదని, సమాధానమన్నారు. షేర్ మార్కెట్ బ్రోకర్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుని చేసినప్పుడే ప్రజలకు అనుమానం కలిగిందన్నారు. నేరుగా సంబంధం లేకున్నా అన్నింటిపై ఆయనే మాట్లాడుతున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
మీకు మీరు చెప్పుకోవడం కాదు
తనపై, తన తండ్రిపై ఆరోపణలు లేవని లేవని మంత్రి నారా లోకేష్ సొంతగా కితాబు ఇచ్చుకోవడం సరికాదని, రూ.53 వేల కోట్ల ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని జీవీఎల్ ఆదివారం అన్నారు. దీనిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఖాతాలు ఉన్నాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, కానీ మిగతా రాష్ట్రాల్లో తక్కువ పీడీఏ ఖాతాలు ఉన్నాయన్నారు. బెంగాల్లో 153 పీడీఏ ఖాతాలు, గుజరాత్లో 478 కాగ్ తన నివేదికలో చెప్పిందని, హర్యానాలో 235 కోట్లు, తెలంగాణలో ఏడాదికి 8545 కోట్లు జమ చేశారని తెలిపిందన్నారు. కానీ ఏపీలో 58వేల పీడీఏ ఖాతాలు తెరిచి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఈ వ్యవహారంలో రూ.1500 కోట్ల వడ్డీ కుంభకోణం కూడా ఉందని ఆరోపించారు.