ఇదేనా రైతు ప్రభుత్వం..? ప్రభుత్వాన్ని నిలదీసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ..!!
హిందూపురం/హైదరాబాద్ : హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని సూటిగా విమర్శించారు. రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల వ్యవహరించే విధానం ఇదేనా అని నిలదీసారు. ఖరీఫ్ ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఇంతవరకూ ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో లేవంటే ప్రభుత్వ అదికారులు ఎంత మొద్దు నిద్ర పోతున్నారో అర్థం అవుతుందని మండిపడ్డారు.
రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ వేరుశనగ విత్తనం రైతులకు అందించడంలో విఫలమై నిర్లక్ష వైఖరి అవలంబిస్తోందని, రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు.అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ మాట్లాడారు. ఖరీఫ్ ప్రారంభమై నెల గడిచినా వేరుశనగ విత్తనం రైతులకు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
పొలాల్లో ఉండాల్సిన రైతులు విత్తనాలు, ఎరువుల కోసం అర్ధరాత్రి విత్తన కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతూ రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏ సమస్యా రాలేదని, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నాణ్యమైన విత్తనం, ఎరువులు అందించామని గుర్తుచేశారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని విత్తనం, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు అధికమయ్యాయని, గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.
విద్యార్థులకు నోటుపుస్తకాలు, ప్రశంసా పత్రాల పంపిణీకార్యక్రమంలోనూ ఆయన మాట్లాడారు. పుట్టిన ఊరు, దేశానికి మంచి పేరు తెచ్చేలా విద్యనభ్యసించాలన్నారు. చదువు సంపాదనే కాకుండా సమాజ సేవకు పాటు పడాలని విద్యార్థులకు సూచించారు.