నేపాల్లో భూకంపం, భారత్కు తాకిడి: ఏపీ రాజధానిపై పరిశోధన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నగరంలో భూకంపాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం రెండు అధ్యయనాలు చేస్తోంది. అందులో ఒకటి పూర్తయింది. మరో అధ్యయనం కొనసాగుతోంది.
నేపాల్లో భారీ భూకంపం వచ్చి, రెండువేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ భూకంపం ప్రభావం భారత దేశంలోని పలు రాష్ట్రాల పైన కూడా పడిన విషయం తెలిసిందే. బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోను ప్రకంపనలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశమైంది. శనివారం నాడు శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు కోస్తాలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాదుకు చెందిన ఐఐటీ నిపుణులు ఇటీవల విజయవాడ, పరిసర ప్రాంతాల్లో భూకంపం అంశంపై సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో.. బందర్ రోడ్డు నుండి కానూరు వరకు, గుండాల, మొగుల్రాజపురం, పోరంకి, భవానీపురం, కొండపల్లి తదితర ప్రాంతాలు ఎర్త్ క్వేక్ జోన్లుగా గుర్తించారని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎత్తైన భవనాలు నిర్మించడం సముచితం కాదని సర్వేలో వెల్లడైనట్లుగా సమాచారం.
ఈ ప్రాంతాల్లో బిల్డింగ్ కోడ్ అమలు చాలా ముఖ్యమని వారు గుర్తించారు. అయితే, ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ కోడ్ లేదు. స్థానికంగా ఎన్నో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇది ఎర్త్ క్వేస్ జోన్ కాబట్టి ఇక్కడ ప్రత్యేక నిర్మాణాలు, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణాలు చేయడం ముఖ్యమని చెప్పారని తెలుస్తోంది.
ట్రిపుల్ ఐటీ నిపుణులు అనేక మ్యాప్లు, భూగర్భ పరిస్థితి తదితరాలపై పరిశోధించి ఒక అంచనాకు వచ్చారు. ఇక్కడ నేల స్వభావం ఇతరత్రా అంశాలపై పరిశోధన చేసి, ఒకవేళ భూకంపం వస్తే ఇక్కడి భూమి ఎలా స్పందిస్తుంది, ఏ ప్రాంతంలో ప్రకంపనలు అధికాగం ఉండే అవకాశం ఉందనే దానిపై నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి పంపించారని తెలుస్తోంది. విజయవాడ, చుట్టుపక్కల 150 కిలోమీటర్ల పరిధిలోని కొన్ని ప్రాంతాలు భూకంప కేంద్రాలుగా గుర్తించారని తెలుస్తోంది.
గతంలో లాతూర్లో భారీ భూకంపం రావడంతో ప్రాణ నష్టం ఎక్కువ అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 64 నగరాల పరిధిలో భూకంప తీవ్రతను తెలుసుకోవాలని నిర్ణయించింది. వాటిలో విజయవాడ నగరం కూడా ఉండటంతో దానిపై సర్వే చేశారు. ఇప్పుడు నేపాల్లో భూకంపం రావడంతో మరోసారి చర్చనీయాంశమైంది.