జగన్..ఇక మండలి ముఖం చూడదలచుకోలేదట: బడ్జెట్ భేటీ నాటికి మంగళం?: ఆ డీల్ కోసమే హస్తినకు..!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72 గంటల వ్యవధిలో ఢిల్లీ విమానం ఎక్కడానికి సిద్ధపడుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. రెండు రోజుల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినకు వెళ్లబోతుండటం వల్ల అదే స్థాయిలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం ఖాయమని, కేంద్ర మంత్రివర్గంలో చేరడం కేవలం ఇక లాంఛనప్రాయం మాత్రమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ వైఖరిపై జాతీయ స్థాయిలో: టీడీపీ ఎమ్మెల్సీల హస్తిన ప్రయాణం: సీమ నేతలు డౌటే.. !
బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యే సమయానికి..
వచ్చేనెల రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. వచ్చేనెల 15వ తేదీ నుంచి సరిగ్గా నెల రోజుల పాటు బడ్జెట్ ప్రతిపాదనల మీద అసెంబ్లీ సమావేశమౌతుంది. శాసన మండలిని రద్దు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది. పార్లమెంట్ ఆమోదం పొందితేనే.. శాసన మండలి రద్దు అవుతుంది.
శాసన మండలి సమావేశమౌతుందా?
శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన అది రద్దయినట్టు కాదు. ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించేంత వరకూ అది సజీవంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ప్రకటించింది జగన్ సర్కార్. సాంకేతికపరంగా ఇంకా మనుగడలోనే ఉన్నందున.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీతో పాటు శాసన మండలిని కూడా సమావేశ పర్చాల్సి ఉంటుంది.
అడుగు పెట్టదలచుకోలేదట..
బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిని కూడా సమావేశ పర్చాల్సి ఉంటుందనే అంశం అధికార పార్టీ నాయకులకు మింగుడు పడట్లేదని అంటున్నారు. వచ్చే నెల 15వ తేదీ నాటికల్లా మండలికి శాశ్వతంగా మంగళం పలకాలనే పట్టుదల వైఎస్ జగన్లో కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ నెల రోజుల్లోగా మండలిని రద్దు చేయించేలా కేంద్రంపై ఒత్తిడిని తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ మూడు రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి ప్రయాణం కట్టారని అంటున్నారు.
తెలుగుదేశంపై ఆధిపత్యం ఉండటమే కారణమా..
ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ పార్టీకి 27 మంది సభ్యుల బలం ఉంది శాసన మండలిలో. అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి వస్తోంది. శాసన మండలి ఆమోదించిన చట్టాలను మండలి అడ్డుకుంటోందనే అసహనం అధికార పార్టీ నేతల్లో ఇప్పటికే చాలా సందర్భాల్లో వ్యక్తమౌంది. ఏపీ వికేంద్రీకరణ సహా సీఆర్డీఏ రద్దు వంటి కొన్ని కీలక చట్టాలను మండలి అడ్డుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే..
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు దశలవారీగా కొనసాగుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టడం, దానిపై చర్చ జరగడం పూర్తయింది. అందుకే మలి దశ సమావేశాలు వచ్చేనెల పునఃప్రారంభమౌతాయి. పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాల్లోనే శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టించడం, దాన్ని ఆమోదింపజేసుకోవాలని వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనితోపాటు కొన్ని కీలక అంశాలపైనా వైఎస్ జగన్ కేంద్రాన్ని సంప్రదించబోతున్నారు.