కొండవీడు కోటకు సమీపంలో 150 కోట్లతో స్వర్ణ దేవాలయం
గుంటూరు: రూ. 150 కోట్లతో గుంటూరు జిల్లాలోని కొండవీడు ప్రాంతంలో శ్రీకృష్ణునికి బంగారు ఆలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ నిర్ణయించింది. ఈ దేవాలయానికి దసరా రోజున శంకుస్థాపన చేయాలని ముహుర్తం నిర్ణయించినట్లు ఇస్కాన్ తెలిపింది.
ఈ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే అవకాశం ఉందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. మొత్తం 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయ ప్రాంతాన్ని ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేసింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే వెన్నముద్దల చిన్న కృష్ణుడు ఇక్కడ కొలువదీరనున్నాడు.
జిల్లాలోని యడ్లపాడు మండలం చెంఘీజ్ ఖాన్పేటలోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ప్రపంచంలోనే అతి అరుదైనదని వేదపండితులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయించిందని వెల్లడించారు.
అంతేకాదు ఈ ప్రాంతంలో ఇస్కాన్ గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ బంగారు దేవాలయం చుట్టూ మహాభారత, రామాయణాలపై పురాణ గాథలను వివరిస్తూ వినూత్నరీతిలో మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉంటాయన్నారు.
వీటితో పాటు వేద పాఠశాల, అండర్ వాటర్ మెడిటేషన్ హాలు, ప్రాచీనశాస్త్రాలను సైన్స్ పరంగా చూపే థియేటర్లు, శ్రీకృష్ణుని లీలలను భావితరాలకు తెలిపే ధీం పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఇస్కాన్ దక్షిణ భారత ఛైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ వివరించారు.