వాయుగుండం ముప్పు: కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, హెచ్చరిక
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం భారీ వర్షాలతో మరోసారి ఉత్తరాంధ్ర, కోస్తాను వణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా కోస్తాకు వాయుగుండం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా, ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు అల్పపీడనం పయనిస్తోందని, అల్పపీడనం మరింత బలపడినట్టు వాతావరణం కేంద్రం తెలిపింది. అది వాయుగుండంగా మారి మచిలీపట్నానికి 230 కి.మీ.. విశాఖకు దక్షిణంగా 300 కి.మీ, గోపాల్ పూర్కు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు అధికారులు వెల్లడించారు.
రానున్న 24 గంటల్లో వాయుగుండం ఈశాన్య దిశగా పయనించనుంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని, అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రభావిత జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.