పీఎస్ఎల్వీ-సీ47 కార్టోశాట్ కౌంట్ డౌన్: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్: స్వామివారి పాదాల వద్ద నమూనా
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్ఎల్వీ -సీ47 కార్టోశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభించిన నేపథ్యంలో.. ఆయన తిరుమలేశుడిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్టోశాట్ నమూనా పత్రాలను స్వామివారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలను చేశారు.
శివసేన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు ప్రక్రియ షురూ: ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్పెషల్ సెషన్
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు శివన్ కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం శివన్ కు రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆశీర్వచనాలను పలికారు. ఇస్రో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా ఘన విజయం సాధించాలని ఆశీర్వదించారు.
అనంతరం శివన్ విలేకరులతో మాట్లాడారు. బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-47 కార్టోశాట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలనే కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందడానికి వచ్చానని అన్నారు. ఈ ప్రయోగం ఆశించిన విధంగా విజయవంతం అవుతుందని, స్వామి వారి ఆశీస్సులు సదా తమ వెంట ఉంటాయని అకాంక్షిస్తున్నట్లు శివన్ చెప్పారు.
పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి మంగళవారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. ఇది 26 గంటలపాటు కొనసాగుతుందని, చివరి సెకెనులో కార్టోశాట్ ను అంతరిక్షంలోకి పంపిస్తామని అన్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. నెల్లూరు జిల్లాశ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-47 కార్టోశాట్ నింగిలోకి పంపించనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ ప్రయోగం ఈ నెల 25వ తేదీనే చేపట్టాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.