ఇస్రో అమ్ముల పొదిలో కొత్త అస్త్రం - విజయవంతంగా నింగిలోకి
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ54 నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కొద్దిసేపటి కిందటే ఈ ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు. ఈ 44.4 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రాకెట్ సరైన గమ్యంలోనే సాగుతోందని తెలిపారు.
ఈ పీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక తన వెంట తొమ్మిది ఉపగ్రహాలను మోసుకెళ్లింది. దీని ప్రధాన పేలోడ్.. ఓషన్శాట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ - 6గా కూడా పిలుస్తారు. దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎనిమిది ఇతర నానో-ఉపగ్రహాలను తీసుకెళ్లింది. వాటి బరువు 321 టన్నులు. ఒక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ బరువే 1,117 కేజీలు.
పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ వర్షన్లో ఇది 24వది. ఈ ఉదయం సరిగ్గా 11:56 నిమిషాలకు శాస్త్రవేత్తలు థ్రస్టర్లను మండించడం ద్వారా రాకెట్ను అంతరిక్షంలోకి పంపించారు. ఇదివరకే ఇస్రో ప్రయోగించిన ఓషన్శాట్-2తో ఇప్పుడు తాజాగా పంపించిన ఈఓఎస్ 3 అనుసంధానమౌతుంది. ఫలితంగా- ఇప్పుడు కొనసాగుతున్న అధ్యయనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవు. సముద్రాలపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇప్పుడు తాజాగా పంపించనున్న ఓషన్శాట్ శాస్త్రవేత్తలకు సహకరిస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా గుర్తించడానికీ వీలు ఉంటుంది. సముద్రాల ఉపరితల వాతావరణం, ఉష్ణోగ్రతలపై ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. దీని వల్ల సముద్రాలు, ఉపరితల వాతావరణం, క్లైమెట్ ఛేంజ్ గురించి సమగ్రంగా అధ్యయనం చేయడానికి వీలు ఉంటుంది. మిగిలిన వాటిల్లో ఎనిమిది పేలోడ్స్ ఉన్నాయి. అవన్నీ నానో శాటిలైట్సే. అమెచ్యుర్ రేడియో కమ్యూనికేషన్ నానో శాటిలైట్స్ అవి. వాటిని థైబోల్ట్-2, థైబోల్ట్-2గా పిలుస్తారు.
భూటాన్కు చెందిన భూటాన్శాట్, బెంగళూరుపిక్సెల్ కంపెనీకి చెందిన ఆనంద్, సియాటెల్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న స్పేస్ఫ్లైట్ అనే సంస్థకు చెందిన నాలుగు ఇతర ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పీఎస్ఎల్వీ-సీ54 ద్వారా నింగిలోకి పంపించారు.